Thursday, 25 November 2021

కొండకోనల్లో మోగిన పెళ్లి బాజాలు.... వనం పూలన్ని తలంబ్రాలుగా 140 జంటలు ఒక్కటయ్యాయి..

నల్లమల్లకు పెళ్లి కళ వచ్ఛింది.. కొనంత సందడి నెలకొంది..అడవి బిడ్డల పెళ్లి సంబురం నల్లమల్ల సీమలో అంబరాన్ని అంటింది... వనవాసి కళ్యాణ పరిషత్  ఆధ్వర్యంలో  శ్రీశైలం నల్లమల అడవుల్లో నివసించు అతి ప్రాచీన పురాతన తెగ అయిన చెంచులు. (అంటే శ్రీ శ్రీ శ్రీ చెంచులక్ష్మి నరసింహ స్వామి శ్రీ శ్రీ మల్లికార్జున స్వామి చెంచుల అల్లుళ్లు గా భావిస్తారు). వీరు ఎక్కువ శాతం అడవులలో  నివసించడం వలన పేదరికం వల్ల పెళ్లిళ్లు కావడం కష్టం.  కావున సహజీవనం చేస్తారు, పిల్లలు కూడా ఉంటారు.  అందుకని మన హిందూ పద్ధతిలో ఈ చెంచులకు సామూహిక వివాహాలు చేయాలనే నిర్ణయించడం జరిగింది.
 సుమారు రెండు జిల్లాలు ఆరు మండలాలు 31 చెంచుగూడెం లు నుండి 140 కుటుంబాలు ఎంపిక చేసారు.  దీనికోసం ఒక్కో జంట కూ పెళ్లి కోసం తాళి బొట్టు,మెట్టెలు పెండ్లి బట్టలు ఇద్దరికీ కలిపి,15.000రూపాయలు ఖర్చు అని అంచనా వేసి  దాతల వద్ద నుండి ధన, వస్తు రూపేనా నిధులు సేకరించారు.
 కన్నుల పండుగగా ఈ 140 ఆదివాసీ (చెంచులు) జంటల సామూహిక కళ్యాణ మహోత్సవం గత నెల అక్టోబర్ 31 వ తేదీన నల్గొండ మరియు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా లో గల అచ్చంపేట పట్టణంలో జరిగింది.
వధూ వరులకు, వారి బంధువులకు, స్నేహితులకు ఘనంగా సామూహిక విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు శ్రీ గరికపాటి నరసింహారావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు.

Wednesday, 17 November 2021

ఇహ రైల్వేలో పాత విధానం.. "ప్రత్యేక"తొలగింపు...


ఢిల్లీ : ప్రత్యేక రైళ్లను ఇక కొవిడ్‌కు ముందు మాదిరిగానే నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటించింది. ‘ప్రత్యేక’ నంబర్లను తొలగించి పాత నంబర్లను కేటాయించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ‘రైల్వే కాలపట్టిక- 2021’లో సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అప్‌లోడ్‌ చేసింది. ఇప్పటికే టికెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులకు మారిన రైలు నంబర్ల వివరాల్ని ఎస్‌ఎంఎస్‌ల రూపంలో పంపించింది. 76 రైళ్లకు ప్రత్యేక నంబర్లకు ముగింపు పలికి రెగ్యులర్‌ రైళ్లుగా మార్చింది. ఈ మేరకు ఆయా రైళ్ల జాబితాను విడుదల చేసింది.*

Tuesday, 9 November 2021

వన మాలినికి పురస్కారం... మోదీ నమస్కారం...

తులసి చెట్టు 24గంటలు ప్రాణవాయువు పంచే మొక్క..
ఆ పేరు పెట్టడం వల్లనేమో..ఆమే  ఆ ప్రాణవాయువు అందజేసేందుకు అవసరం అయిన మొక్కలు నాటి అవి మానులై ఏదిగేవరకు సంరక్షణ చేసి వనానికే ఆమే కన్నతల్లిగా మారారు..అందుకే ఆమెను అత్యున్నత దేశ సేవల పురస్కారంతో గౌరవించారు.
రాష్ట్రపతి భవన్‌లోని పద్మ అవార్డుల ప్రదానోత్సవం సమయంలో తులసి గౌడ అని పేరు పిలవగానే.. సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ వస్తుంటే.. దర్బార్‌ హాల్‌లోని కళ్లన్నీ ఆమెవైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూశాయి.
 అడవి తల్లికి ఆడబిడ్డ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఏ క్షణాన ఆమెకు 'తులసి' అని పేరుపెట్టారో గానీ, ఆ పేరుకు తగ్గట్లుగా ఆమె జీవితం కూడా ప్రకృతితో మమేకమైంది.  40 వేల వృక్షాలతో వనసామ్రాజ్యాన్నే సృష్టించింది. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే.. పద్మశ్రీ అవార్డును తెచ్చిపెట్టింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య  ఆమె దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. 
ఆ పెద్దావిడను చూడగానే మోదీ కూడా ఎంతో గౌరవంగా ప్రతినమస్కారం చేయడం అక్కడున్న అందర్నీ ఆకర్షించింది. కర్ణాటకలోని అంకోలా తాలూకా హొన్నాలి గ్రామానికి చెందిన తులసి గౌడ.. హలక్కీ గిరిజన కుటుంబంలో జన్మించారు. ఆమెకు రెండేళ్ల వయసులోనే తండ్రి మరణించారు. దీంతో పూట గడవడానికి రోజూ తల్లితో కలిసి కూలీకి వెళ్లేది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువుకు దూరమవడంతో తులసికి చదవడం, రాయడం రాదు. 10-12 ఏళ్ల వయసులోనే గోవింద గౌడ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె భర్త మరణించాడు. తన జీవితంలో చీకట్లు కమ్మినందుకు ఆమె ఎప్పుడూ కుంగిపోయేది. దీని నుంచి బయటపడటానికి నిత్యం దగ్గర్లోని అడవిలో గడిపేది. అక్కడి చెట్లే ఆమెకు ఓదార్పునిచ్చేవి. ఆనందాన్నిచ్చేవి. అలా ఆమెకు అడవితో బంధం ఏర్పడింది. చిన్నతనం నుంచే తులసికి మొక్కలంటే ప్రాణం. ఎన్నో రకాల మొక్కలు నాటేది. రాను రాను అదే తన జీవితం అయిపోయింది. ఆమె మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం చూసి అటవీ శాఖ అధికారులు ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. 
ఆమె అంకితభావం చూసి కొన్నాళ్లకు ఆమెను శాశ్వత ఉద్యోగిగా నియమించారు. ఇలా పద్నాలుగేళ్ల పాటు అటవీశాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. 
అయితే మొక్కల పెంపకాన్ని మాత్రం ఆపలేదు. అరవై ఏళ్లలో తులసి నలభై వేలకు పైగా మొక్కలు నాటి వాటిని పెంచారు.తులసి చదువుకోలేదు గానీ ఆమెకు చెట్ల గురించి ఎన్నో విషయాలు తెలుసు. ఎప్పుడు నాటాలి, ఎన్ని నీళ్లు పోయాలి, దాని జీవితకాలం.. ఔషధ గుణాలు.. ఏది అడిగినా చటుక్కున చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా అబ్బురపడేంత వృక్ష విజ్ఞానం ఆమె సొంతం. 
అందుకే పర్యావరణవేత్తలు ఆమెను 'ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌' అని పిలుస్తారు. కానీ ఆమె ఊరి వాళ్లు మాత్రం ఆమెను వనదేవతగా కొలుస్తారు. ఆమెను చూడటానికే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. అరుదైన వృక్షాల జాతుల గురించి తెలుసుకొని పోతుంటారు.76ఏళ్ల వయసులోనూ తులసి ఏ మాత్రం అలసట చెందకుండా మొక్కలు నాటుతారు. నీళ్లు పోసి కన్నబిడ్డలా వాటిని పెంచుతారు. తనకొచ్చే పింఛను డబ్బులన్నింటినీ దీనికే ఖర్చు చేస్తున్నారు. 
టేకు మొక్కల పెంపకంతో మొదలైన ఆమె ప్రస్థానం పనస, నంది, ఇంకా పెద్ద వృక్షాలు పెంచే వరకూ వెళ్లింది. మొక్క నాటితేనే సంతృప్తి రాదు.. అది మానుగా మారితేనే ఆనందం అని చెప్పే తులసి జీవితం.. నేటి తరానికి ఆదర్శప్రాయం..!