తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలను మే 14 నుండి 18వ తేదీ వరకు
అంజనాద్రి ఆకాశ గంగ, జపాలి, నాదనీరాజన వేదిక, ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఐదు రోజుల పాటు టిటిడి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు
ఇందులో భాగంగా అంజనాద్రి ఆకాశ గంగ వద్ద ఉదయం 8.30 గంటలకు,
శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఉదయం 9 గంటలకు, కాలినడకబాటలో ఏడవ మైలు వద్ద ఉన్న శ్రీప్రసన్న ఆంజనేయస్వామి వారికి మధ్యాహ్నం 3 గంటలకు హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు.
అదేవిధంగా జాపాలి తీర్థంలో ఉదయం స్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టిటిడి అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమదీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు పాల్గొంటారు.
కాగా మొదటి ఘాట్రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆరోజు సాయంత్రం ప్రత్యేక పూజా కార్యక్రమాలను టిటిడి నిర్వహిస్తుంది.
హనుమత్ జయంతి సందర్భంగా మఠాధిపతులు అనుగ్రహభాషణం ఇవ్వనున్నారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్.వి సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలను టిటిడి ఏర్పాటు చేసింది.
పురాణ ప్రాశస్త్యం -
వానర దేవుడైన హనుమంతుడు చైత్రపూర్ణిమ నాడు జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తొంది. ఆ రోజున వాయువుపుత్రుడైన హనుమంతుడుని పూజించడం ద్వారా శక్తి సామర్థ్యాలు పెంపొందుతాయని, శరీరానికి బలాన్ని, ఆయురారోగ్యాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పండితులు తెలిపారు.
లక్ష్మణునికి సంజీవని కోసం పర్వతాన్నే లేవనెత్తిన హనుమంతుడు దుష్టశక్తుల నుంచి కాపాడుతాడని, ఆయుష్షును, ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు కోరిన కోరికలను నెరవేర్చుతాడని భక్తుల నమ్మకం.
కావున తెలుగు ప్రజలు హనుమంతుడు జన్మించిన చైత్రపూర్ణిమ పర్వదినం నుండి 41 రోజులు హనుమదీక్ష ఆచరించి, వైశాఖ మాసం కృష్ణపక్షం బహుళ దశమినాడు 10వ రోజు హనుమజ్జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
No comments:
Post a Comment