Thursday, 28 November 2024

*వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలి....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం, నవంబర్ -28 : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పాఠశాలల హెడ్ మాస్టర్ లు, ఎం.ఈ.ఓ. లతో సమీక్షించారు. పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు ఖాళీలు ఏర్పడ్డాయా, విద్యార్థుల హాజరు, పేరెంట్ టీచర్స్ మీటింగ్, నాలెడ్జ్ బుక్ లెట్, మిడ్ డే మిల్, సైన్స్ ఫెయిర్, న్యూట్రీ గార్డెన్, 10వ తరగతి పరీక్షలు, తదితర అంశాలపై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*   విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, ఇక్కడ ఫెయిల్ అయిన విద్యార్థులు చదువు నిలిపి వేసే ప్రమాదం ఉందని, కావున వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వారం రోజులలో  బాగా చదివే పిల్లలు ఏ కేటగిరి, యావరేజ్ పిల్లలను బీ కేటగిరీ, ఫెయిల్ అవుతారు అనుకునే పిల్లలను సి కేటగిరీ గా విభజించాలని అన్నారు. బీ క్యాటగిరి పిల్లలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు పరిశీలించి, అందులో వారికి అవసరమైన అదనపు శిక్షణ అందించాలని అన్నారు. సి కేటగిరీ పిల్లలకు ముఖ్యమైన పాఠ్యాంశాలు అనేకసార్లు బోధిస్తూ పాస్ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని అన్నారు. ప్రతి క్యాటగిరి విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ లకు సూచించారు.డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులకు పరీక్షలు అలవాటు అయ్యే విధంగా వీలైనంత వరకు ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.  సీ కేటగిరీ విద్యార్థులకు ఇప్పటి నుంచి గతంలో పరీక్షలలో అనేకమార్లు వచ్చిన ప్రశ్నలు, పాఠ్యాంశాలు బోధిస్తూ వారానికి రెండు రోజులు పరీక్షలు పెట్టాలని అన్నారు.చదువులో వెనుకబడిన సి క్యాటగిరి విద్యార్థుల తల్లిదండ్రులకు వారానికి 2 సార్లు ఫోన్ చేస్తూ పిల్లలను ఇంట్లో కూడా కొంత సమయం చదివించాలని, చదివే వాతావరణం ఇంట్లో కల్పించాలని, నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ చేయాలనీ అన్నారు.  10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆ సమయంలో వారికి మంచి పౌష్టికాహారం అందించాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం జనవరి నెలలో ఒక మోటివేషన్ సెషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులకు ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, 16 పాఠశాలల్లో అమలు చేశామని అన్నారు. 16 పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మిగిలిన ఉన్నత పాఠశాలలో సైతం స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులకు నేర్పే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  విద్యాశాఖ ద్వారా వచ్చే మార్పు ఇతర శాఖల ద్వారా సాధ్యం కాదని, మన పై అత్యధిక బాధ్యత ఉంటుందని, దీనినీ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న *అదనపు కలెక్టర్ డా. శ్రీజ మాట్లాడుతూ,* పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు ఏదైనా కారణం చేత సెలవు లో ఉంటే మండల పరిధిలో  డిప్యూటేషన్ విధులు కేటాయించి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి సూచించారు.  విద్యార్థుల హాజరు అంశాన్ని ప్రతి వారం మండల విద్యా శాఖ అధికారి రివ్యూ చేయాలని, తక్కువ హాజరు ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి ఫాలో అప్ చేయాలని అన్నారు.పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటుకు వీలుగా అవసరమైన కూరగాయల మొక్కలు, మెడిసినల్ మొక్కలు గ్రామాలలోని నర్సరీలో పెంచేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అభ్యాస దీపికలతో పాటు విద్యార్థులకు మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నాలెడ్జ్ బుక్ లెట్ తయారు చేస్తున్నామని, మండలాలలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఈ బుక్లెట్ రూపొందిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణకు ప్రతిరోజు ఒక్క ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలని, పిల్లల భోజనం నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ పడవద్దని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో  జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, ఎం.ఈ.ఓ లు, హెడ్మాస్టర్ లు, తదితరులు పాల్గోన్నారు.

Wednesday, 27 November 2024

*సమాజానికి చేసే సేవ శాశ్వతంగా నిలిచిపోతుంది .......జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*



*నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు విద్యార్థులు క్రమ పద్ధతిన కృషి చేయాలి*

*వి.వెంకటాయపాలెం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బోర్వెల్, పైప్ లైన్ ఆర్.ఓ. ప్లాంట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం, నవంబర్ -27 : సమాజంలో నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తూ సేవలు అందించే వారే శాశ్వతంగా నిలిచిపోతారని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం రఘునాధపాలెం మండలం వి. వెంకటాయ పాలెం గ్రామంలోని జహీర్ అహ్మద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3 లక్షల 50 వేల రూపాయలతో ఏర్పాటు చేసిన బోర్ వెల్, పైప్ లైన్, ఆర్. ఓ.ప్లాంట్ ను, 50 వేల విలువ గల కరెంట్ మోటర్ ను జిల్లా కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కుతుంబాక బసవ నారాయణ, కుతుంబాక కోటేశ్వరరావు స్నేహానికి జ్ఞాపకార్ధంగా  పాఠశాలకు 3 లక్షల 50 వేల విలువచేసే ఆర్.ఓ. ప్లాంట్, బోర్ వెల్, పైప్ లైన్ ను కూతుంబాక మధు, 50 వేల రూపాయల కరెంట్ మోటర్ ను కూరాకుల నాగభూషణం పాఠశాలకు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*  పాఠశాల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  మాటలకే పరిమితం కాకుండా విద్యార్థుల శ్రేయస్సు గురించి ఆలోచించి వసతులు కల్పించడం సంతోషకరమని అన్నారు. 
పాఠశాలలో అవసరమైన టాయిలెట్లు సైతం రాబోయే రోజులలో పూర్తి చేస్తామని అన్నారు.  పాఠశాలకు జహీర్ అహ్మద్ పేరు పెట్టారని, కొంత సమయం గడిచిన తర్వాత  మన రంగు, కులం, మతం, ఆస్తి ఎవరు గుర్తు పెట్టుకోరని, సమాజంలో మనం చేసిన సేవే శాశ్వతంగా గుర్తుంటుందని కలెక్టర్ తెలిపారు. సమాజం కోసం పనిచేసే వారికి విలువ ఉంటుందని అన్నారు. విద్యార్థులు జీవితంలో ఎదగడంతో పాటు ఇతరులకు సహాయం చేసే ఆలోచనతో ఉండాలని, మన గ్రామాలను,రాష్ట్రాలను బాగు చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు చేయాల్సిన పనులు క్రమ పద్ధతి ప్రకారం పూర్తి చేయాలని అన్నారు.విద్యార్థి దశలో పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మన స్నేహితులు కూడా బాగా చదువుకునేలా ప్రోత్సహించాలని, అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదివితేనే గొప్ప విజయాలు సాధ్యమవుతాయని కలెక్టర్ అన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ పాఠశాలలోని లైబ్రరీనీ పరిశీలించి ఆకర్షణీయంగా, పిల్లలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలని అన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్, షూస్ కొరకు గతంలో కలెక్టర్ అందించిన లక్షా 50 వేలతో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ డ్రెస్, షూస్ ను జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించారు.

అనంతరం దాతలు కూతుంబాక మధు, కూరాకుల నాగభూషణం ను జిల్లా కలెక్టర్ సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాద్యాయులు, విద్య కమిటీ చైర్ పర్సన్, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గోన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీచేయనైనది.

Thursday, 21 November 2024

భర్త మినిస్టర్.. భార్య ఆఫీసర్.. అన్నా వదిన అంటూ పలకరించిన సీఎం రేవంత్ రెడ్డి..


TG: CM రేవంత్ వేములవాడ పర్యటనలో ఆసక్తికర దృశ్యం కనిపించింది. ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో ఐటీ మినిస్టర్ శ్రీధరాబాబు సతీమణి శైలజారామయ్యార్ వచ్చారు. మంత్రులకు స్వాగతం పలికారు. తన భర్త శ్రీధర్ బాబుకు సైతం ఆమె ఫ్లవర్ బొకే ఇచ్చి వెల్కం చెప్పారు. సీఎం రేవంతు స్వాగతం పలకగా 'అన్నా.. వదిన' అంటూ ఆయన నవ్వుతూ వారిని పలకరించారు. 'ఫొటో బాగా దిగండి' అని పొన్నం సైతం నవ్వులు పూయించారు.

Thursday, 7 November 2024

పెలేది ఆటంబాంబు... పొంగులేటి వార్నింగ్


మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటుబాంబు పేలబోతోంది అంటూ ఇదివరకే ఓసారి కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈసారి నాటు బాంబు..లక్ష్మిబాంబు కాదు..త్వరలోనే ఆటమ్‌ బాంబ్‌ పేలబోతోంది అంటూ ప్రకటించారు. గుమ్మడికాయ దొంగలు ఎవరు అంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. తప్పు చేసిన ఎవ్వరినీ చట్టం వదిలి పెట్టదని.. ఏ తప్పూ చేయకపోతే అంత వివరణ ఎందుకు అంటూ ఎద్దేవా చేశారు.ప్రభుత్వానికి చెందిన రూ.55 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో త్వరలోనే బయటపడతాయని, అపుడు ఎవరు ఏమిటనేది ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఆటంబాంబు పేలుతుంది.. సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాగా ఫార్ములా ఈ రేసింగ్ కేసులో జరిగిన అక్రమాల్లో కేటీఆర్ జైలుకు వెళతారనే ప్రచారం నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.

*సొసైటీ అక్రమాలపై విచారణ... రికార్డ్ ట్యాంపరింగ్ పై చర్యలు..*


*కల్లూరు సొసైటీలో* పలు అవకతవకలపై విచారణ ప్రారంభమైంది. ధాన్యం కొనుగోలు కమీషన్ గోల్మాల్ అయ్యిందని విశాల సహకార పరపతి సంఘంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న తోట ప్రవీణ్ అక్టోబర్ 25న తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.దాంతో డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆఫీసర్ అక్టోబర్ 28న విచారణ అధికారిని నియమించారు. అలాగే సోమవారం ఖమ్మంలో జరిగిన గ్రీవెన్స్ లో తోట ప్రవీణ్, నల్లగట్ల రాజేష్ కలిసి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదును అందజేశారు. కల్లూరు సొసైటీలో పలు అవకతవకలకు పాల్పడ్డారని, ధాన్యం కొనుగోలు కమీషన్ గోల్మాల్ అయిందని, సర్వీస్ రికార్డు ట్యాంపరింగ్ జరిగిందని, గతంలో జరిగిన విచారణలో అధికారులు తప్పుడు వాంగ్మూలం ఇచ్చారని, 2006 నుంచి 2021 వరకు సబ్ స్టాప్ గా ఉన్న వ్యక్తి స్టాఫ్ అసిస్టెంట్ గా పనిచేశానని తప్పుడు వాంగ్మూలం ఇచ్చి అధికారులను, పాలకవర్గాన్ని మోసం చేసి సీఈఓ అయ్యాడని వారు కలెక్టర్ కు వివరించారు. దాంతో కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. తక్షణమే విచారణ జరిపి నివేదికను అందించాలని ఆదేశించారు. 
జిల్లా సొసైటీ అధికారి ఉషారాణి కల్లూరు సొసైటీలో మంగళవారం విచారణ చేపట్టారు. ఈ విచారణ సజావుగా సాగినా నిజాలు నిగ్గు తేలేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా, సొసైటీ అక్రమాలపై చర్యలు తీసుకునేలా నివేదికలు ఉండాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విచారణలో న్యాయం జరగకపోతే 51 మందిని ఎంక్వయిరీ చేసి సమగ్ర విచారణ చేస్తే సొసైటీ అక్రమాలు బయటపడే అవకాశం ఉందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.

Wednesday, 6 November 2024

*అర్హులైన లబ్ధిదారులకు పాడి పశువుల పంపిణీకి చర్యలు.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం : ఇందిరా మహిళా డైరీ ఏర్పాటులో భాగంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పాడి పశువులను సంబంధిత కార్పొరేషన్ల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండల కేంద్రంలో పర్యటించి ఇందిరమ్మ మహిళా డెయిరీ చిల్లింగ్ యూనిట్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,* చిల్లింగ్ యూనిట్ ఏర్పాటు చేసే  స్థలం వెంటనే స్వాధీనంలోకి తీసుకొని ప్రహరీ గోడ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముదిగొండ మండల పరిధిలో చిల్లింగ్ యూనిట్ సంబంధించి 5 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి పాల సేకరణ కేంద్రానికి కనీసం 10 మంది పాడి రైతులను ట్యాగ్ చేయాలని అన్నారు. పాడి పశువులను పంపిణీ చేసేందుకు మహిళా సంఘాల సభ్యులలో అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.  పాడి పశువుల అంశంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత కల్పించాలని, ప్రస్తుతం ఒకటి, రెండు పశువులు ఉన్న వారికి మరో రెండు పాడి పశువులు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల పంపిణీ కోసం లబ్ధిదారులను గుర్తించిన తర్వాత వారికి సంబంధిత కార్పొరేషన్ల (ఎస్సీ, బీసీ, ఎస్టీ) ద్వారా రుణం మంజూరు అయ్యేలా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
అనంతరం ముదిగొండ మండలంలో ఉన్న గ్రంథాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. లైబ్రరీలో అందుబాటులో ఉన్న పుస్తకాలు, ఎంతమంది పాఠకులు ప్రతి రోజు గ్రంథాలయానికి వస్తున్నారు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు హాజరవుతున్నారా, వారికి స్టడీ మెటీరియల్ అందించారా మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. లైబ్రరీలో పుస్తకాల రిజిస్టర్, పుస్తకాల లెండింగ్ రిజిష్టర్లను కలెక్టర్ పరిశీలించారు. 

గ్రంథాలయాన్ని ప్రతి రోజు తెరిచే విధంగా చర్యలు తీసుకోవాలని, దీని నిర్వహణ బాధ్యతలలో స్థానిక యువతను భాగస్వామ్యం చేయాలని, ముదిగొండలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఈ లైబ్రరీ వినియోగించుకునేలా చూడాలని, గ్రంథాలయం మరమ్మత్తుల కోసం అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, డిటీడబ్ల్యూఓ విజయలక్ష్మీ, ముదిగొండ మండల ఎంపీడీఓ శ్రీధర్ స్వామి, తహసీల్దార్ సునీత ఎలిజబెత్, లైబ్రేరియన్ శ్రీనివాస్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------

*ఇందిరా డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాలు, క్రొత్త యూనిట్లు ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్ తదితర అంశాలపై సమీక్షించిన జిల్లా కలెక్టర్*
ఖమ్మం :మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న ఇందిరా మహిళా డెయిరీలో మౌళిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ తో కలిసి ఇందిరా మహిళా డెయిరీ నిర్వహణ, పాల సేకరణ కేంద్రాల ఏర్పాటు, క్రొత్త యూనిట్ ల ఏర్పాటు, మహిళా సంఘాల గ్రేడింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*  ఇందిరా మహిళా డెయిరీలో కల్పించాల్సిన మౌళిక సదుపాయాలపై దృష్టి సారించాలని అన్నారు.  మండలంలో ఏ గ్రామాలలో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలో ముందుగా నిర్థారించాలని, పాల ఉత్పత్తి అధికంగా ఉంటూ, అందుబాటులో ప్రభుత్వ భూమి ఉన్న గ్రామాలలో ముందుగా పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. 

పాల సేకరణ కేంద్రాలకు అవసరమైన కియాస్కులు ఏపిఎం ల వద్ద అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ అవసరమైన మిల్క్ గ్రేడర్, సెగ్రిగేటర్, క్యాన్ లు, రిఫ్రాక్టోమీటర్ మొదలగు పరికరాలను ఏపిఏం సేకరించి పాల సేకరణ కేంద్రంలో ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పాల సేకరణ కేంద్రాల నుంచి మండల కేంద్రంలోని బి.ఎం.సి. పాయింట్ వద్దకు పాలు తరలించే రూట్స్, వాహనాల క్రమబద్ధీకరణ చేయాలని కలెక్టర్ తెలిపారు. 

మధిర అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఏర్పాటు చేయు బి.ఎం.సి. పాయింట్ లకు గ్రామాల నుంచి ఇక్కడికి పాలు తరలించేలా రూట్ ర్యాషనలైజేషన్ చేయాలని అన్నారు. నియోజకవర్గ మండల కేంద్రాల్లో ఎర్రుపాలెం మాదిరి బి.ఎం.సి. యూనిట్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 

బల్క్ మిల్క్ చిల్లింగ్ కేంద్రాల ద్వారా 5000 లీటర్ల పాల చిల్లింగ్, స్టోరెజ్ యూనిట్ ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రతి బి.ఎం.సి. కేంద్రం యూనిట్ కంటేనర్ తో సహా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

నియోజకవర్గ మండలాల్లో బి.ఎం.సి. యూనిట్ ఏర్పాటుకు స్థలాల గుర్తింపు పూర్తయిందని, ముందుగా ప్రహరీ గోడ, గేట్ నిర్మించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, ఈ పనులు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని అన్నారు.  కాంపౌండ్ వాల్ అనంతరం కంటేనర్ మాడల్ లో బి.ఎం.సి. కేంద్రాల ఏర్పాటుకు టేండర్ ఆహ్వానించాలని కలెక్టర్ తెలిపారు. 

బి.ఎం.సి. కేంద్రాల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేస్తామని, 4 మండలాలలో ఎర్రుపాలెం మాదిరిగానే విద్యుత్ సరఫరా పనులు చేపట్టాలని కలెక్టర్ ఎస్ఈ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. 

రాబోయే సమావేశం నాటికి బి.ఎం.సి. యూనిట్ ఏర్పాటుకు గుర్తించిన భూములలో కాంపౌండ్ వాల్, గేట్ నిర్మాణం, బి.ఎం.సి. యూనిట్ టెండర్ ప్రక్రియ, విద్యుత్ సరఫరా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పాల ఉత్పత్తి పెంచేందుకు డిసెంబర్ నెలలోపు 500 గేదెలు కొనుగోలు చేసి 250 యూనిట్లు గ్రౌండ్ చేయడం జరుగుతుందని అన్నారు. 

పాల ఉత్పత్తి చేసే పాడి కుటుంబాలను గుర్తించి మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా వారీగా  పాడి పశువుల యూనిట్ గ్రౌండ్ చేయాలని, మండలానికి 50 యూనిట్లు డిసెంబర్ నాటికి గ్రౌండింగ్ కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం తక్కువ పశువులు ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి రెండు గేదెల చొప్పున పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నవంబర్ 15 నాటికి పాడి పశువులు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించి వారి జాబితా అందజేయాలని కలెక్టర్ తెలిపారు. పాడి పశువుల యూనిట్ల సంబంధిత లబ్ధిదారుల కులాల కార్పొరేషన్ (ఎస్సి,బీసి, ఎస్టీ) కార్పొరేషన్ ద్వారా గ్రౌండ్ చేయడం జరుగుతుందని అన్నారు. 

పాడి పశువుల యూనిట్ గ్రౌండింగ్ చేశాక పాలు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉందని, మన దగ్గర పాలు పోసే పాడి రైతులకు అందుబాటులో ఉన్న రివాల్వింగ్ ఫండ్ నుంచి 48 గంటల వ్యవధి లోగా చెల్లింపు చేస్తున్నామని అన్నారు.  

జిల్లాలో కనీసం 90 శాతం స్వశక్తి మహిళా సంఘాలకు ఏ+ బి  గ్రేడింగ్  ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  ముదిగొండ మండలంలో విఓఏ  ల ఏ+ బి గ్రేడింగ్ పెరిగిందని, ఇదే పనితీరు కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు. తల్లాడ మండలంలో విఓఏ  ల ఏ+ బి గ్రేడింగ్ తగ్గడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. తల్లాడ మండల పరిధిలో విఓఏ సమావేశాలు రెగ్యులర్గా ఎందుకు జరగడం లేదు కారణాలు తెలుసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

మహిళా శక్తి కార్యక్రమ అమలు కోసం నిరంతరం స్వశక్తి మహిళా సంఘాల సమావేశాలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు.  రాబోయే రెండు నెలల తర్వాత నిర్వహించే సమావేశంలో సైతం పని తీరు మెరుగు కానీ పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని , పనిచేయడం ఇష్టం లేని పక్షంలో ఖమ్మం జిల్లా వదిలి ఇతర జిల్లాలకు బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని కలెక్టర్ సూచించారు.కూసుమంచి మండలంలో 300 పైగా గ్రూపులకు గ్రేడింగ్ జరగక పోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు.  మహిళా సంఘాల గ్రూపులకు గ్రేడింగ్ వచ్చే విధంగా తీసుకోవాల్సిన చర్యలు గురించి ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. 
ముదిగొండ, వైరా, రఘునాధపాలెం, మొదలగు మండలాలలో గ్రేడింగ్ పెరిగిందని సంబంధిత అధికారులను కలెక్టర్ అభినందిస్తూ, ఇదే స్ఫూర్తి కొనసాగిస్తూ భవిష్యత్తులో మరింత పెరిగేలా పని చేయాలని  సూచించారు. మహిళా సంఘాల సమావేశాలు రెగ్యులర్ గా నిర్వహిస్తూ వారి  జీవనోపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేయాలని అన్నారు.
మహిళా శక్తి కింద గ్రౌండ్ చేసిన యూనిట్లు లాభసాటిగా నడిచేలా ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు అందించాలని అన్నారు.  మహిళా శక్తి యూనిట్లలో బాగా నడవని వివరాలను సీసీ ల ద్వారా సేకరించి వాటిని పరిశీలిస్తూ ఎందుకు నడవడం లేదు పరిశీలించి వాటి పని తీరు మెరుగయ్యేలా చూడాలని అన్నారు. 
మధిర, చింతకాని మండలాలు మహిళా శక్తి యూనిట్ గ్రౌండింగ్ బాగా చేశాయని కలెక్టర్ అభినందించారు. మహిళా శక్తి యూనిట్ ల గ్రౌండింగ్ కాకపోవడానికి గల కారణాలు, ఎటువంటి యూనిట్ల గ్రౌండింగ్ కాలేదు కలెక్టర్ ఆరా తీశారు.  సీసీలను ఎప్పటి కప్పుడు ఫాలో అప్ చేస్తూ , బ్యాంకర్లతో సంబంధం చేసుకుంటూ త్వరగా గ్రౌండ్ అయ్యేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. రాబోయే సమావేశం నాటికి కనీసం 70 శాతం వరకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. 
ఐకేపి ద్వారా సన్న రకం ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. స్థానిక రైతుల నుంచి మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని, రైతు ఎన్ని ఎకరాలలో పంట పండించాడొ అంత పంట మాత్రమే కొనుగోలు చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్డీఏ డిపిఎంలు, ఏపీఎం లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Monday, 4 November 2024

*చెల్లెమ్మ టీ స్టాల్ మంచిగా నడుస్తుందా.... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


*మహిళలు వ్యాపార రంగంలో రాణించి  మహిళా శక్తి బ్రాండ్ గా నిలవాలి... జిల్లా కలెక్టర్*
*అతివలకు ఇందిర మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుంది.. జిల్లా కలెక్టర్*
ఖమ్మం : మహిళలు ఆసక్తి ఉన్న రంగంలో అర్ధికంగా రాణించాలని, ఇందిరా మహిళా శక్తి పథకం అండగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 
సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న ఇందిర మహిళా శక్తి స్త్రీ టీ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించారు. స్త్రీ టీ నిర్వాహకురాలను చెల్లెమ్మ చాయ్ సెంటర్ మంచిగా నడుస్తుందా, వ్యాపారం అనుకూలంగా ఉందా అని అప్యాయంగా అడిగారు. కలెక్టరేట్ బస్ స్టాప్ లోనే టీ స్టాల్ ఉందిగదా గిరాకి వస్తుందా అని ఆరాతీసారు. చెల్లెమ్మ టీ పెట్టమ్మ అంటూ కలెక్టర్ చాయ్ ని సేవించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, వ్యాపార అభివృద్దికి సౌకర్యాలు కల్పించే అవసరం ఉందా అని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ* ఇందిర మహిళా శక్తి పథకం కుటుంబానికి ఆర్ధిక ప్రగతినిస్తుందని, మహిళలు స్వయం శక్తితో ఎదగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. చేయూత ఇచ్చే భాద్యత మాది.. మీ తలరాతలు మార్చుకునే శక్తి మీదని కలెక్టర్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం మహిళల ఆర్థిక స్వావలంబన, స్వయం సమృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ తెలిపారు. మహిళలకు లబ్ది చేకూరాలనేది ప్రభుత్వం లక్ష్యమని, ఇందుకోసం స్త్రీ నిధి ఏర్పాటు, బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నమని తెలిపారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా అతివలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి, నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌‌లలో మెలకువలు నేర్పించేందుకు సౌకర్యాలను కల్పిస్తున్నామని, 
గ్రామీణ సంఘాలకు ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లబ్టి చేకూరే విధంగా కార్యాచరణను వివరించారు. సుదీర్ఘకాలంగా మహిళాభ్యున్నతికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించి నిలదొక్కుకునే విధంగా చేయాలనేదే మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి అధికారులు తోడ్పాటు అందిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు.మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్న ఈ కార్యక్రమాన్ని స్వయం సహాయక గ్రూపుల సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ద్వారా ఇంట్లో ఉండి ఏదైనా వ్యాపారం చేసుకోసి స్వయం ఉపాధిని పొందవచ్చు అన్నారు. ఒంటరిగా వ్యాపారాలు చేయలేని మహిళలు గ్రూపులుగా కూడా వ్యాపారాలు నిర్వహించుకోవచ్చు అన్నారు.మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని వారికి చిన్నగా చేయూత ఇస్తే, ఇక వారు వెనక్కి తిరిగి చూసుకోకుండా అనుకున్నది సాధిస్తారని చెప్పారు.మహిళాలు ఆర్థికంగా ఎదిగి, మిగతా వారికి ఆదర్శంగా నిలువాలని కలెక్టర్ ఆకాక్షించారు.
#################################
---------------------------------------------------------------------
*పక్కా ప్రణాళికతో ఇంటింటి సర్వే... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్* 
---------------------------------------------------------------------
*ఇంటింటి సర్వేలో ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వవద్దు.. జిల్లా కలెక్టర్* 
------------------------------------------------------------------------
*ఇంటింటి సర్వే నిర్వహణపై అధికారులకు దిశానిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్*
------------------------------------------------------------------------
ఖమ్మం, నవంబర్- 4 :  రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణకై ప్రభుత్వం ఈ నెల 6 వ తేదీ నుండి ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో పక్కాప్రణాళికతో, ఏ దశలోనూ పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో సుమారు 633304 కుటుంబాలున్నట్లు అంచనా ఉందన్నారు. ప్రతి ఇంటి సర్వేకు పటిష్ట ప్రణాళిక చేశామన్నారు. 3654 ఇబి లుగా చేపట్టి, 3719 ఎన్యుమరేటర్లను, 314 మంది సూపర్వైజర్ల, 5 గురు నియోజకవర్గ అధికారులను నియమించినట్లు ఆయన తెలిపారు. వివిధ శాఖల నుండి గెజిటెడ్ అధికారులను సూపర్వైజర్లుగా, వివిధ శాఖల సిబ్బందిని ఎన్యుమరేటర్లలుగా నియమించామన్నారు. ఖమ్మం కు డిప్యూటీ సిఇఓ నాగలక్ష్మి, పాలేరుకు అదనపు డిఆర్డీవో నూరోద్దీన్, వైరా కు డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, సత్తుపల్లి కి కల్లూరు ఆర్డీవో రాజేందర్, మధిర నియోజకవర్గ బాధ్యులుగా ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు లను నియయించినట్లు ఆయన అన్నారు.ఒక ఎన్యుమరేషన్ బ్లాక్ కి ఒక సర్వేయర్ ఉండాలన్నారు. సర్వేలో 75 పప్రశ్నలు ఉన్నట్లు, ఒక ఇంటి సర్వేకు 30 నిమిషాల సమయం, రోజుకు ఒక సర్వేయర్ 10 ఇండ్ల సర్వే చేపట్టనున్నట్లు ఆయన అన్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో ఇండ్ల లిస్టింగ్ పూర్తి చేయాలని ఆయన తెలిపారు. ఒక్కో సర్వేయర్ కు 150 ఇండ్లు కేటాయించామన్నారు. రోజువారి లక్ష్యం పెట్టుకొని, 15 రోజుల్లో సర్వే ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. డాటా ఎంట్రీ ఆపరేటర్లను సిద్ధంగా ఉంచాలని, వీరిని మండల స్టాటిస్టిక్ అధికారులు పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ తెలిపారు. ఏ దశలో పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు ఎప్పటికప్పుడు సూపర్ చెక్ చేపడుతూ, పర్యవేక్షణ చేస్తూ, వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ అన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారిణి రాజేశ్వరి, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, 3 November 2024

*ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు*- *వనసమారాధనలో రాష్ట్ర మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు*-



ఖమ్మం : ఉద్యోగులు సహకరిస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ,  తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
గొల్లగూడెం రోడ్డులోని చెరుకూరి వారి మామిడి తోటలో ఆదివారం తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్స్ (టి.జి.ఈ.జే.ఏ.సి.) ఆధ్వర్యంలో నిర్వహించిన సకల ఉద్యోగుల కార్తీక మాస వన సమారాధన, ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో *రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి* ఆత్మీయ అతిథులుగా హాజరు కాగా, ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు, చైర్మన్ మారం జగదీశ్వర్  ఆత్మీయ అతిథులకు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
ఈ సందర్భంగా  *మంత్రి పొంగులేటి మాట్లాడుతూ,* ప్రత్యేక రాష్ట్ర సాధనలో 204 ఉద్యోగ సంఘాలు ఏకధాటిగా పోరాటం చేశాయని, వీరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం రావాలని ఉద్యోగుల కోరడంతో నేడు ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఏ ఉద్యోగి, మహిళా, రైతు, జర్నలిస్టులు వారి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా తెలిపే అవకాశం లేదని అన్నారు.  ప్రజా ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు అవుతుందని,  ఉద్యోగులకు భరోసా కల్పించడమే కాకుండా ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని అన్నారు.   ప్రభుత్వం చిత్తశుద్ధితో దుబారాలు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ఉద్యోగస్తులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన డీఏ లను క్రమ పద్ధతిలో మంజూరు చేస్తామని అన్నారు.రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సీఎం చర్చించారని, ఆర్ధికేతర ఇబ్బందులను వచ్చే మార్చి లోపల పూర్తి చేస్తామని అన్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఉద్యోగులు సంతృప్తి చెందే విధంగా, వారి ముఖంలో చిరునవ్వు వచ్చే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు.ఆర్థికంగా ఇబ్బందులేని సమస్యలను ఈ సంవత్సరం క్యాలెండర్ మారే లోపల పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గత ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాను అశ్రద్ద చేసిందని, ప్రస్తుత ప్రభుత్వంలో ఖమ్మం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఆనాటి ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ, గౌరవం లేదని, అనేక ఇబ్బందులు పెట్టారని మంత్రి గుర్తు చేశారు.గతంలో టీచర్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించిందని మంత్రి తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ ఉద్యోగిని ఎటువంటి ఇబ్బందులకు పెట్టదని తెలిపారు. కొంతమంది ప్రశాంత వాతావరణం పాడు చేసే విధంగా అపోహలు సృష్టిస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేస్తూ ఉద్యోగులపై భారం తగ్గిస్తున్నామని అన్నారు. మంత్రి *తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ,*  ఉద్యోగులు కోరుకున్న మార్పు ప్రకారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ముఖ్యమంత్రి ధైర్యం చేసి ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. బ్యాలెట్ పేపర్ లలో ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజల అవసరాలు గమనించే ఉద్యోగులు ఇచ్చిన తీర్పుగా ఇది భావిస్తామని, ప్రజల కష్టాలను తీర్చగలిగేది ఉద్యోగులు మాత్రమేనని అన్నారు. ప్రజలు తమకు జరిగే మంచిలో అధికారుల, ఉద్యోగుల పేర్లు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని మంత్రి తెలిపారు.ఉద్యోగుల కష్టాన్ని, త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని అన్నారు. 40 సంవత్సరాలుగా తన హయాంలో పనిచేసిన అధికారుల కారణంగానే ప్రజలు తనను గుర్తు పెట్టుకున్నారని, రోడ్డు వేసిన, నీటిపారుదల పనులు జరిగిన, అభివృద్ధి కార్యక్రమాల్లో ఉద్యోగుల శ్రమ ఉందని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని, పూర్వ వైభవం తీసుకుని రావడంలో ఉద్యోగులు దృష్టి సారించాలని అన్నారు. 
ఉద్యోగులకు రావాల్సిన ప్రతి అంశాన్ని అందించడం ప్రభుత్వ బాధ్యతని, బాకీలను దశల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులకు న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు.  ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఉద్యోగులకు తెలుసని, పేద ప్రజలు, రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూనే ఉద్యోగులు నిజాయితీగా పని చేసే శక్తిని ప్రభుత్వం అందిస్తుందని అన్నారు.*ఉద్యోగుల ఐకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస రావు మాట్లాడుతూ,*   గత 10 నెలల కాలంలో నిర్బంధ ప్రభుత్వం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చాక మన హక్కుల గురించి ప్రశ్నించే స్వేచ్ఛ మనకు లభించిందని, సీఎం మన సమస్యల పరిష్కారం కోసం మనతో సుదీర్ఘంగా చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. గత పది సంవత్సరాలలో ఉద్యోగుల జేఏసీ లేదని, సర్వీస్ రూల్స్ లేవని , ప్రశ్నిస్తే ప్రతిబంధకాలు, క్రిమినల్ కేసులు నమోదు చేశారని అన్నారు. రాబోయే మార్చి తర్వాత ఆర్థికపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారని, దీపావళి తర్వాత ఆర్థికేతర సమస్యలు పరిష్కరించడంతో పాటు పెండింగ్ లో ఉన్న బకాయిలు చెల్లించాలని సీఎం ఆదేశించారని తెలిపారు.రైతులు, మహిళలతో పాటుగా ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి ప్రాధాన్యమేనని సీఎం తెలిపారని, ప్రతి ఒక్కరితో చర్చించి ఇచ్చిన మాటలు అమలు చేస్తామని అన్నారు.*ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడుతూ...* తెలంగాణ రావడానికి ఖమ్మం జిల్లా చైతన్యం కారణమని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకు వచ్చారని అన్నారు. ఉద్యోసమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణతో పాటు ఆర్కెస్ట్రా, చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశిష్టంగా అలరించాయి.
జిల్లాలో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న అన్నం శ్రీనివాస రావును, వనజీవి రామయ్యలను, సీనియర్ సిటిజన్ రిటైర్డ్ ఉద్యోగులను ఉద్యోగ సంఘాల తరపున ఉద్యోగుల ఐకాస రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, శాసనమండలి సభ్యులు ఏ. నర్సిరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, టీజీఓ జిల్లా అధ్యక్షులు కస్తాల సత్య నారాయణ, టి.జి. ఓ. జిల్లా ప్రధాన కార్యదర్శి మోదుగు వేదాద్రి, టి.జి.హెచ్.డబ్ల్యు.ఓ. జిల్లా అధ్యక్షులు కోటిపాక రుక్మారావు, దేవరకొండ సైదులు, నాగిరెడ్డి, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు, పెన్షనర్స్, సీనియర్ సిటిజన్స్, తదితరులు పాల్గొన్నారు.

Saturday, 2 November 2024

హైదరాబాద్‌లో మరింత దూరం మెట్రో... రెండో దశకు అనుమతులు... జీవో నంబ‌ర్ 196ను జారీ చేసిన తెలంగాణ సర్కార్

హైదరాబాదులో మెట్రో రైలు మరింత దూరం పరుగులు పెట్టేందుకు రెండవ దశ పనులకు తెలంగాణ సర్కార్ పచ్చ జెండా ఊపింది ఇందుకు సంబంధించి. జీవో నంబ‌ర్ 196ను  తెలంగాణ సర్కార్ జారీ చేసింది.రెండో దశలో మొత్తం 116.4 కిలోమీటర్లు నిర్మించాలని నిర్ణయం.. ఇందులో పార్ట్‌-ఏ కింద 76.4 కిలోమీటర్లు, పార్ట్-బీ కింద 40 కిలోమీట‌ర్ల నిర్మాణంపార్ట్‌-ఏలో నాగోల్-శంషాబాద్ విమానాశ్రయం 36.8 కిలోమీట‌ర్లు, రాయదుర్గం-కోకాపేట 11.6 కిలోమీట‌ర్లు, ఎంజీబీఎస్-చాంద్రయాణగుట్ట 7.5 కిలోమీట‌ర్లు, మియాపూర్‌-ప‌టాన్‌చెరు 13.4 కిలోమీట‌ర్లు, ఎల్బీనగర్‌-హ‌యత్‌నగర్ 7.1 కిలోమీట‌ర్ల నిర్మాణ పార్ట్-బీలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు నిర్మాణం
మొత్తం రూ.24,269 కోట్ల నిర్మాణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లు, పీపీపీ పద్ధతిలో రూ.1,033 కోట్లు రూపాయల వ్యయంతో రెండవ దశ కొనసాగనం ఉంది.

సిపిఎం ఫిర్యాదుతో కదిలిన ప్రభుత్వం.... రంగంలోకి హైడ్రా డిప్యూటీ కలెక్టర్....

హైదరాబాద్ :.భూముల పరిరక్షణ కోసం సిపిఎం ఇచ్చిన ఫిర్యాదు మేరకు  మాదాపూర్ లోని 41/14 సర్వే నంబర్లు జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన హైడ్రా డిప్యూటీ కలెక్టర్ విజయ్ కుమార్...CPM నాయకులు శోభన్,  ప్రభుత్వ భూముల పరిరక్షణ కోరుతూ వివరాలు తెలపగా తమ శాఖ నుండి చర్యలు తీసుకుంటామని హైడ్రా అధికారులు...ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం ఏ విధంగా జరుగుతుందో డిప్యూటీ కలెక్టర్ కు వివరించిన సిపిఎం జోన్ కార్యదర్శి చల్లా శోభన్ జోన్ సభ్యులు కొంగరి కృష్ణ సీతారామయ్య మాణిక్యం వరుణ్ శ్రీనివాస్. ఈ  సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శోభన్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి మండలం పరిధిలోని ఖానా మెట్ విలేజ్ లో 41/14 సర్వే నంబర్లు మొత్తం 250 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమిని గత ప్రభుత్వం వివిధ సంస్థలకు కేటాయించింది అని తెలిపిన సిపిఎం శోభన్...సుమారుగా 70 ఎకరాల భూమి ఇంకా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పటికీ  అనేక పర్మిషన్లు తీసుకొని ప్రభుత్వ భూములనే లక్ష్యంగా చేసుకుంటూ ప్రైవేటు సర్వేనెంబర్లు వేసి 41/14లో నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిచ్చిన సిపిఎం నాయకులు... గతంలో రెవెన్యూ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్న సిపిఎం నాయకులు...ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా కమిషన్ సభ్యులు ఈరోజు పర్యటించడం తమ పోరాటానికి బలాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.హైడ్రా పై తమకు సంపూర్ణ నమ్మకం ఉందని ప్రభుత్వ భూముల రక్షణ కోసం హైడ్రాకు తమ పార్టీ వైపు నుండి సంపూర్ణ సహకారం ఉంటుందన్న సిపిఎం ...

  .

ఖర్గేకు ఇప్పుడు తెలిసొచ్ఛిందా.. ప్రధాని నరేంద్ర మోడీ కౌంటర్

ఢిల్లీ; కాంగ్రెస్ ఎన్నికల హామీల తీరుపై ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎన్నికల హామీలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కౌంటర్ ఎటాక్ చేశారు.
ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు తయారయ్యాయని మోడీ ఎద్దేవా చేశారు.
రాష్ట్ర బడ్జెట్‌ ఆధారంగా ఎన్నికల గ్యారంటీలను ప్రకటించాలని, ఇష్టమొచ్చినట్లు హామీలివ్వరాదని రాష్ట్ర ఇంచార్జ్‌లకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం సూచించారు. ఆర్థికంగా అమలు చేయగలిగే వాగ్దానాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. దీనికి కౌంటర్‌గా మోడీ ట్వీట్‌ చేశారు. ''అడ్డగోలు హామీలు ప్రకటించడం చాలా తేలికైన విషయమే. కానీ వాటిని సరిగ్గా అమలు చేయడం కఠినం, అసాధ్యమనే విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడే గుర్తించింది. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇస్తారు. వాటిని ఎప్పటికీ నెరవేర్చలేరని కూడా వారికి తెలుసు. కాంగ్రెస్‌ నిజ స్వరూపం ఇప్పుడు బయట పడింది. ప్రజల ముందు దోషుల్లా నిలబడి ఉంది. ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదు. ఇది రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేయడమే. ఇలాంటి రాజకీయాల వల్ల నష్టపోయే బాధితులు పేదలు, యువకులు, రైతులు, మహిళలే. వీరంతా గ్యారంటీల ప్రయోజనాలకు దూరమవుతారు. ఉన్న పథకాలు కూడా వారికి దక్కుండాపోతాయి' అని మోడీ పేర్కొన్నారు. హర్యానా ప్రజలు మాత్రం కాంగ్రెస్ మోసాన్ని తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు. గతంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో అమలు కాని వాగ్దానాలు చేసి మోసం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎలా పనిచేస్తుందనడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు. భారతదేశ ప్రజలు అభివృద్ధి మరియు పురోగతిని కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి అన్నారు.

Friday, 1 November 2024

ఇహ బడ్జెట్ ఉంటేనే హామీలు : ఖర్గే కీలక ప్రకటన


న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైన హామీలు ఇవ్వబోమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక ప్రకటన చేశారు. బడ్జెట్‌ ఆధారంగా మాత్రమే హామీలు ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు.
లేకపోతే రాష్ట్రం ఆర్థిక సంక్షోభానికి లోనవుతుందని హెచ్చరించారు. ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ.. 'మహారాష్ట్ర ఎన్నికల్లో 5, 6, 10, 20 వంటి ఎలాంటి హామీలను ఇవ్వడం లేదు. బడ్జెట్‌ ఆధారంగా మాత్రమే హామీలు ఇవ్వాలి. ప్రణాళిక లేకుండా ప్రగతి సాధించడం కష్టం. ఇలాటి పరిస్థితుల్లో ఇవ్వబోయే హామీలు నెరవేర్చలేకపోతే, భవిష్యత్‌ తరాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది. రోడ్ల నిర్మాణానికి కూడా నిధుల పొంది ఉంటే, ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉంటారు. ప్రభుత్వానికి విఫలత రాకుండా చూసుకోవాలి' అన్నారు.
అయితే ఎన్నికల సమయంలో ప్రజలను ఆకట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ పలు హామీలను ఇస్తోంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో, తెలంగాణలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ, ఇప్పుడు అందించిన ఉచిత పథకాల అమలుకు విఫలమవుతోందని విమర్శలు వస్తున్నాయి. కర్ణాటకలో ఉచిత బస్సు పథకం ప్రారంభమైన నెల రోజుల్లోనే నిలిపివేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. తెలంగాణలో ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలో నిస్పృహగా ఉన్న కాంగ్రెస్‌పై విపక్షాలు కఠినమైన విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ హామీలపై వెనకడుగు వేస్తున్నట్లు భావిస్తున్నారు.

*85 వేల మంది ఎన్యూమరేటర్లతో తెలంగాణలో మేగా సర్వే"..... సంక్షేమ పథకాలకు మార్గదర్శి అవుతుంది : మంత్రి పొన్నం ప్రభాకర్

రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి చేపట్టబోయే ఇంటింటికి సమగ్ర సర్వే  (సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ మరియు కులాల సర్వే) కు రాష్ట్ర ప్రజలంతా సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్  విజ్ఞప్తి చేశారు.దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాహుల్ గాంధీ  మాట మేరకు ఈ జరుగుతున్న ఈ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఈ సర్వే రాబోయే కాలంలో అన్ని రకాల పథకాలను లబ్ధిదారులకు అందించేందుకు ఒక మెగా హెల్త్ చెకప్ మాదిరిగా ఉపయోగపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సర్వేలో సమాచారం సేకరిస్తున్నవారు, సమాచారం తెలుపుతున్నవారు ప్రతి తెలంగాణ బిడ్డ ఈ సర్వేలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన తెలంగాణ ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.
 *85 వేల మంది ఎన్యూమరేటర్లు..* 

నవంబర్ 6వ తేదీ నుంచి 85 వేల మంది ఎన్యూమరేటర్లు ప్రజల వద్ద నుంచి సమాచారం సేకరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక అబ్జర్వర్ గా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల పర్యావేక్షణ ఉంటుందన్నారు. ఇంటింటి నుంచి సమగ్ర సమాచారం సేకరించి ఆ డేటాను ఎంట్రీ చేయడంతో పాటు నవంబర్ 30 లోపు ఈ సమాచార సేకరణ పూర్తి చేయాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కులగణన కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో నెం 199 ద్వారా నిరంజన్ చైర్మన్ గా రాపోలు జయ ప్రకాశ్, తిరుమల గిరి సురేందర్, బాల లక్ష్మి మెంబర్లుగా బీసీ కమిషన్ ను నియమించిందని, రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ను నోడల్ డిపార్ట్ మెంట్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ పౌరులతో పాటు ఇతర బలహీనవర్గాల అభ్యున్నతి కోసం వివిధ సామాజిక ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలపై ప్రణాళికలు రచ్చించి వాటిని అమలు చేయడం నిమిత్తం ఈ సర్వే కోసం ఫిబ్రవరిలోనే శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేశామని గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు కర్మాటక సీఎం సిద్దరామయ్య  సమక్షంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 4 ఫిబ్రవరి న తెలంగాణలో ఇంటింటికి సమగ్ర సర్వే చేపట్టాలని రాష్ట్ర క్యాబినెట్  తీర్మానించిందన్నారు.

*వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి* : కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. *పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు..... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*


ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం అందేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం మామిళ్ళగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఆంగ్ల పాఠ్యాంశం బోధిస్తున్న తీరును జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తరగతి గదిలో విద్యార్థినులతో కలిసి కూర్చొని పరిశీలించారు. ఆంగ్ల భాష పట్ల భయం అవసరం లేదని, ప్రతిరోజు ఒకరికొకరు కొంత సేపు ఆంగ్లంలో మాట్లాడుకుంటే భాషను సులువుగా నేర్చుకోవచ్చని అన్నారు. కలెక్టర్ విద్యార్థులతో మమేకమై వారిని ఆంగ్లంలో మాట్లాడించి, వారిని చైతన్య పరిచారు.అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై, బోధన ప్రమాణాలు, పాఠశాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ,*  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఆంగ్లం సులువుగా అర్థం చేసుకొని, మాట్లాడే విధంగా *యూ కెన్ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్* కార్యక్రమాన్ని మన ఖమ్మం జిల్లాలో అమలు చేస్తున్నామని అన్నారు. ప్రతి తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి సైతం ఆంగ్ల పదాలు సరిగ్గా ఉచ్చరించి మాట్లాడే విధంగా బోధించాలని కలెక్టర్ సూచించారు.
పాఠశాలల్లో 80 శాతం కంటే తక్కువ అటెండెన్స్ ఉన్న విద్యార్థుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  హై స్కూల్ చదివే బాలికలకు పీరియడ్స్ టైంలో పాఠశాలకు గైర్హాజరు కాకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. బేస్ లైన్ పరీక్షను పక్కాగా నిర్వహించి క్రమపద్ధతిలో విద్యార్థుల ప్రమాణాలు పెంచేలా చూడాలని అన్నారు.
పాఠశాలలో పిల్లల, ఉపాధ్యాయుల హాజరు, నాణ్యమైన భోజనం, పాఠ్యాంశాల బోధన విధానం, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని అన్నారు. సాధారణంగా ఉపాధ్యాయులకు బాగా చదివే పిల్లలపై శ్రద్ధ ఉంటుందని, మన పాఠశాలల్లో తరగతి గదులలో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలో బాలికల టాయిలెట్ల నిర్వహణ పై శ్రద్ధ వహించాలని, టాయిలెట్లను రెగ్యులర్ గా శుభ్రం చేయాలని అన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచి చేతులు కడుక్కునే అలవాటు వచ్చేలా చూడాలని అన్నారు. పాఠశాలల్లో కొంతమంది విద్యార్థులు మందు, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లు గుర్తించామని, వారి తల్లి దండ్రులకు సమాచారం అందించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలీకృతం కాలేదని పాఠశాల హెడ్ మాస్టర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు.  పాఠశాలకు పిల్లల హాజరు తక్కువగా ఉందని, రెగ్యులర్ గా పాఠశాలకు వచ్చేలా చూడాలని, పిల్లలను మానిటర్ చేయాలని కలెక్టర్ సూచించారు. మత్తు పదార్థాలకు బానిస పడిన పిల్లలకు వెంటనే కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఇది సులువు కానప్పటికీ టీచర్లు కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.మత్తుకు బానిసైనా విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మన పిల్లలుగా భావించి ఓపికతో పిల్లలను బాగు చేయాలని, వారికి మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించాలని, క్రీడలు, చదువులో వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం చేశారు.
పాఠశాలలో డైనింగ్ హాల్ లేకపోవడం, ప్లే గ్రౌండ్ లేకపోవడంతో ప్రత్యామ్నాయ ప్రదేశానికి ఆలోచన చేయాలన్నారు. పాత డిఆర్డీవో కార్యాలయ భవనాలను కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భవనాల సద్వినియోగం చర్యలు చేపట్టాలని కలెక్టర్ అన్నారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఏఎంఓ రవి, పాఠశాల హెచ్ఎం లక్ష్మీ, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు
----------------------------------------------------------------------
*పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు..... స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ*
ఖమ్మం : పిల్లల సంరక్షణకు పక్కా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. శుక్రవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పిల్లల సంరక్షణపై తీసుకుంటున్న చర్యల గురించి సంబంధించిన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పిల్లల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తున్నట్లు, గత 3 నెలలుగా తీసుకున్న చర్యల వివరాల నివేదికను అధికారులు వివరించారు.  ఈ సందర్భంగా *స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ మాట్లాడుతూ,*   జిల్లాలోని విద్యా సంస్థలలో మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యాశాఖ, సంక్షేమ శాఖ,  వైద్యశాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో యాంటి డ్రగ్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు.ఫోక్సో కేసుల వివరాలను అదనపు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  పోక్సో కేసుల ఫైలింగ్, వైద్యుల నివేదికల సేకరణ పక్కాగా జరగాలని అన్నారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు చిన్నారి కార్యక్రమ అమలుపై సర్కులర్ జారీ చేయాలని విద్యాశాఖ అధికారికి అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తే వారిని గుర్తించి వెంటనే పాఠశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బాల్య వివాహాల నివారణకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలనీ అన్నారు. 
ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మ, జిల్లా బీసి అభివృద్ధి అధికారిణి జి. జ్యోతి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ కెవిబి. రెడ్డి, స్కోప్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ ప్రసాద్, జాగృతి స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్,  సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రామ్మోహన్ ఈ డబ్బులు పే చేయాలి నువ్వు.. : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...


కేంద్ర మంత్రి రామ్మోహన్ డబ్బులు కట్టాలని.. కేంద్రం నుండి తేవాలని ఏ.పి.ముఖ్యమంత్రి చంద్రబాబు అనడంతో అక్కడ నవ్వులు పూసాయి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నియోజకవర్గం ఈదుపురంలో దీపం పథకం 2 ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఈదుపురం చేరుకున్న చంద్రబాబు నాయుడు, ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్; కెంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఇతర అధికారులతో కలిసి అంబటి శాంతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు అక్కడ వారి కుటుంబానికి దీపం 2 పథకం కింద సిలిండర్ అందజేశారు. మీ ఇంటికి గ్యాస్ తీసుకొని వచ్చాను అని చంద్రబాబు వారితో అనడంతో చంద్రబాబుకి శాంతమ్మ, కుటుంబ సభ్యులు నమస్కరించారుఅనంతరం శాంతమ్మతో ఇంట్లో పాలు ఉన్నాయమ్మా మంత్రులందరూ మీ ఇంటికి వచ్చారు కాఫీ పెట్టి ఇస్తావా అన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పోయి వెలిగించి పాలు పెట్టి టీకా కాచారు.. శాంతమ్మ కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడిన చంద్రబాబు అక్కడ జానకమ్మ అనే ఒంటరి మహిళకు పింఛన్ మంజూరు చేశారు. టీకాచేసమయంలోనే దీపం 2 పథకానికి డబ్బులు కేంద్రం నుంచి వచ్చేలా చూడాలంటూ రామ్మోహన్ కు చెప్పారు..