Thursday, 28 November 2024

*వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలి....... జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*


ఖమ్మం, నవంబర్ -28 : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి చదివే విద్యార్థులు పరీక్షలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రభుత్వ పాఠశాలల పనితీరుపై జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పాఠశాలల హెడ్ మాస్టర్ లు, ఎం.ఈ.ఓ. లతో సమీక్షించారు. పాఠశాలలో సబ్జెక్టు టీచర్లు ఖాళీలు ఏర్పడ్డాయా, విద్యార్థుల హాజరు, పేరెంట్ టీచర్స్ మీటింగ్, నాలెడ్జ్ బుక్ లెట్, మిడ్ డే మిల్, సైన్స్ ఫెయిర్, న్యూట్రీ గార్డెన్, 10వ తరగతి పరీక్షలు, తదితర అంశాలపై మండలాల వారీగా జిల్లా కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,*   విద్యార్థుల జీవితంలో 10వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, ఇక్కడ ఫెయిల్ అయిన విద్యార్థులు చదువు నిలిపి వేసే ప్రమాదం ఉందని, కావున వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పని చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. వారం రోజులలో  బాగా చదివే పిల్లలు ఏ కేటగిరి, యావరేజ్ పిల్లలను బీ కేటగిరీ, ఫెయిల్ అవుతారు అనుకునే పిల్లలను సి కేటగిరీ గా విభజించాలని అన్నారు. బీ క్యాటగిరి పిల్లలు ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారు పరిశీలించి, అందులో వారికి అవసరమైన అదనపు శిక్షణ అందించాలని అన్నారు. సి కేటగిరీ పిల్లలకు ముఖ్యమైన పాఠ్యాంశాలు అనేకసార్లు బోధిస్తూ పాస్ అయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని అన్నారు. ప్రతి క్యాటగిరి విద్యార్థులకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ హెడ్ మాస్టర్ లకు సూచించారు.డిసెంబర్ చివరి నాటికి సిలబస్ పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులకు పరీక్షలు అలవాటు అయ్యే విధంగా వీలైనంత వరకు ఎక్కువ పరీక్షలు నిర్వహించాలని అన్నారు.  సీ కేటగిరీ విద్యార్థులకు ఇప్పటి నుంచి గతంలో పరీక్షలలో అనేకమార్లు వచ్చిన ప్రశ్నలు, పాఠ్యాంశాలు బోధిస్తూ వారానికి రెండు రోజులు పరీక్షలు పెట్టాలని అన్నారు.చదువులో వెనుకబడిన సి క్యాటగిరి విద్యార్థుల తల్లిదండ్రులకు వారానికి 2 సార్లు ఫోన్ చేస్తూ పిల్లలను ఇంట్లో కూడా కొంత సమయం చదివించాలని, చదివే వాతావరణం ఇంట్లో కల్పించాలని, నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులు కౌన్సెలింగ్ చేయాలనీ అన్నారు.  10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ఆ సమయంలో వారికి మంచి పౌష్టికాహారం అందించాలని, దీనికి సంబంధించి ప్రతిపాదనలు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ తెలిపారు. 10వ తరగతి విద్యార్థుల కోసం జనవరి నెలలో ఒక మోటివేషన్ సెషన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయులకు ఏదైనా సలహాలు, సూచనలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 8వ తరగతి చదివే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామని, 16 పాఠశాలల్లో అమలు చేశామని అన్నారు. 16 పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని, మిగిలిన ఉన్నత పాఠశాలలో సైతం స్పోకెన్ ఇంగ్లీష్ విద్యార్థులకు నేర్పే దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.  విద్యాశాఖ ద్వారా వచ్చే మార్పు ఇతర శాఖల ద్వారా సాధ్యం కాదని, మన పై అత్యధిక బాధ్యత ఉంటుందని, దీనినీ పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు.
సమావేశంలో పాల్గొన్న *అదనపు కలెక్టర్ డా. శ్రీజ మాట్లాడుతూ,* పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు ఏదైనా కారణం చేత సెలవు లో ఉంటే మండల పరిధిలో  డిప్యూటేషన్ విధులు కేటాయించి ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారికి సూచించారు.  విద్యార్థుల హాజరు అంశాన్ని ప్రతి వారం మండల విద్యా శాఖ అధికారి రివ్యూ చేయాలని, తక్కువ హాజరు ఉన్న విద్యార్థులపై శ్రద్ధ వహించి ఫాలో అప్ చేయాలని అన్నారు.పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటుకు వీలుగా అవసరమైన కూరగాయల మొక్కలు, మెడిసినల్ మొక్కలు గ్రామాలలోని నర్సరీలో పెంచేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అభ్యాస దీపికలతో పాటు విద్యార్థులకు మరింత సమాచారం అందించేందుకు ఖమ్మం నాలెడ్జ్ బుక్ లెట్ తయారు చేస్తున్నామని, మండలాలలో ఒక్కో సబ్జెక్ట్ నుంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే ఈ బుక్లెట్ రూపొందిస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం పర్యవేక్షణకు ప్రతిరోజు ఒక్క ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగించాలని, పిల్లల భోజనం నాణ్యత అంశంలో ఎక్కడ రాజీ పడవద్దని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో  జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ, ఎం.ఈ.ఓ లు, హెడ్మాస్టర్ లు, తదితరులు పాల్గోన్నారు.

No comments:

Post a Comment