కామారెడ్డి, జూలై 16 : డీఎస్పీగా చెప్పుకొంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి రూ.కోటి వసూలు చేసిన మోసగాడిని హైదరాబాద్ బేగంబజార్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామానికి చెందిన నెల్లూరు స్వామిగా గుర్తించారు. 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో నిరుద్యోగులను మోసం చేయడానికి నెల్లూరు స్వామి డీఎస్పీ ముసుగులో కొత్త దందాకు తెరలేపాడు. తనతో పాటు మరికొందరిని కలుపుకొని ముఠాగా ఏర్పడ్డాడు. ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వారి జాబితాను సేకరించాడు.
టీఎ్సపీఎస్సీలో అంతాతమ వారే ఉన్నారని నిరుద్యోగులను నమ్మించాడు. మొదట కామారెడ్డిలో పలువురి నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో 20 మంది నిరుద్యోగుల నుంచి తలా రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల చొప్పున సుమారు రూ.కోటి వరకు వసూలు చేశాడు. స్వామి వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన కొంతమంది యువకులు ఆ విషయాన్ని టీఎ్సపీఎస్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు స్వామిపై నిఘా పెట్టి కూపీ లాగి బేగంబజార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బేగంబజార్, స్పెషల్ పార్టీ పోలీసులు 3 రోజులు బీబీపేట మండలం తుజాల్పూర్లో మకాం వేశారు. కామారెడ్డి పోలీసుల సహకారంతో 14న రాత్రి స్వామిని తుజాల్పూర్లోని అతని ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు.
*డీఎస్పీ యూనిఫాంతో సెటిల్మెంట్లు కూడా*
బీబీపేట మండలంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భార్య అక్క కొడుకు నెల్లూరు స్వామి. ఆ ప్రజాప్రతినిధి అండతోనే అతను మోసాలు చేసినట్లు తెలిసింది. డీఎస్పీ యూనిఫాంలో.. బీబీపేట మండలంతో పాటు దోమకోండ, కామారెడ్డిలో బహిరంగంగా తిరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాత్రి అయిందంటే చాలు.. వాహనంతో బీబీపేట, తుజాల్పూర్ బస్టాండ్ వద్ద పోలీసు అధికారిలా విధులు నిర్వహిస్తూ వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడేవాడని స్వామిపై ఆరోపణలున్నాయి. అలా వచ్చిన డబ్బులో స్థానిక పోలీసులకు వాటా ఇచ్చాడని సమాచారం.
No comments:
Post a Comment