ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 10: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్టలోని పురాతన చారిత్రకప్రాశస్త్యం గల శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 నుండి 9 గంటల వరకు వృషభలగ్నంలో పాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా గరుడపటాన్ని ప్రతిష్టించి శాస్త్రోక్తంగా ధ్వజారోహణ ఘట్టం నిర్వహించారు. ధ్వజస్తంభానికి నవకలశపంచామృతాభిషేకం చేసి ఇంద్రాది సకలదేవతలను, నవగ్రహాలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం చేశారు. అదేవిధంగా, మధ్యతాళం – నాదనామక్రియా రాగం, భృంగిణి తాళం – లలిత రాగం, చంపక తాళం – భైరవి రాగం, ఏకతాళం – మలయమారుత రాగం, త్రిపుట తాళం – మేఘరంజని రాగం, రూపక తాళం – వసంతభైరవి రాగం, గంధర్వ తాళం – కింకర రాగం, నంది తాళం – శంకరాభరణం రాగం, గరుడ తాళం – ఆనందవర్ధన రాగం ఆలపించారు. కంకణబట్టర్ శ్రీ కెహెచ్.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జెఈఓ శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ ధ్వజారోహణంతో వైభవంగా రాములవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా ఏప్రిల్ 13న హనుమంత వాహనం, ఏప్రిల్ 14న గరుడ సేవ, ఏప్రిల్ 15న కల్యాణోత్సవం, ఏప్రిల్ 16న రథోత్సవం, ఏప్రిల్ 18న చక్రస్నానం జరుగుతాయన్నారు.
పట్టువస్త్రాల సమర్పణ
బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి శ్రీ సీతారామలక్ష్మణులకు పట్టువస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ శ్రీ అమరనాథరెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎమ్మెల్యే శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, ఆలయ డెప్యూటీ ఈఓ డా. రమణప్రసాద్, శ్వేత సంచాలకులు శ్రీమతి ప్రశాంతి, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ శ్రీ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆర్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment