మణికుమార్, సత్యన్యూస్,ఖమ్మం.
ఖమ్మంలో జెండా పండుగ
పోలిస్ పేరేడ్ గ్రౌండ్లో.. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు..
ఆనంతరం మంత్రి మాట్లాడారు..
తెరాస ప్రభుత్వసంక్షేమ ఫలాలు
అన్ని వర్గాలకు అందుతున్నాయని,
భారత జాతి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు పోరాడిన త్యాగధనులందరికీ ఈ సందర్భంగా వినమ్ర నివాళులు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.. ప్రతిఒక్కరికీ ముందుగా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సోదరభావం వంటి గొప్ప ఆదర్శాలకు అంకితమిచ్చే రోజుగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండుగగా జరుపుకుందాము. ఈ పవిత్రమైన రోజున దేశ నిర్మాణానికి అందరూ కారణభూతులమవుతూ పునరంకితం కావాలి. జాతీయోద్యమం స్పూర్తితో అహింసా మార్గంలో శాంతియుత పంథాలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఏ ఆశయ సాఫల్యం కోసం మనం స్వరాష్ట్రాన్ని కోరుకున్నామో ఆ లక్ష్య సాధన దిశగా సీఎం కేసిఆర్ సారథ్యంలో రాష్ట్రం పురోగమిస్తున్నందుకు ఎంతగానో హర్షిస్తున్నాను.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశీస్సులతో..ఖమ్మం ఉమ్మడి జిల్లా సమగ్రంగా అభివృద్ధి సాధించిందన్నారు..
ఇటీవల వచ్ఛిన గోదావరి వరదలను అధికారుల సమన్వయం తో..సమర్థవంతంగా ఎదుర్కోని..ప్రజలను సురక్షితంగా వుంచగలిగామని పేర్కొన్నారు..
తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు కనీస జీవన భద్రతను కల్పించేందుకు సంక్షేమ రంగానికి బడ్జెట్ లో సింహ భాగాన్ని వెచ్చిస్తున్నది.
అభివృద్ధి, సంక్షేమం అనే రెండు చక్రాల మీద పరిపాలన సాగుతున్నది. ఇది భారత స్వాతంత్ర్య 75వ స్వాతంత్ర్య ఉత్సవాలు జరుగుతున్న సందర్భం. జాతి చరిత్రలో ఇది ఒక విశిష్ట ఘట్టం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్య సాధన కోసం జరిగిన పోరాటంలోని ఉజ్వల ఘట్టాలను, స్వాతంత్ర్య సమరవీరుల మహోన్నత త్యాగాలను యావత్ భారత జాతి సగర్వంగా స్మరించుకుంటున్నది.
ఈ 75 ఏళ్ళ స్వతంత్ర భారత దేశ ప్రస్థానం లోని వెలుగు నీడలను అందరం వివేచించుకోవాలి. మనం సాధించింది ఏమిటి? ఇంకా సాధించాల్సింది ఏమిటన్నది ఒక్కసారి మదింపు చేసుకోవాలి.
ఒకవైపున దేశం అనేక రంగాలలో కొంతమేరకు పురోగతిని సాధించింది. అదేసమయంలో నేటికీ చాలా రాష్ట్రాలలో ప్రజలు కనీస అవసరాలకోసం కొట్టుమిట్టాడుతున్న దుస్థితీ ఉంది.
మరింత నిబద్ధత, నిజాయితీ. సామరస్యం, సమభావం నిండిన దృక్పథంతో దేశ భవిష్యత్ నిర్మాణానికి భారతప్రజలు పునరంకితం కావాలని కోరుకుంటున్నాను. భరతమాత దాస్య శృంఖలాలను తెంచి, బ్రిటీష్ వలస పాలనను పారదోలాలని మహా సంకల్పంతో భారత స్వాతంత్య్ర సమరం సాగింది. నాటి మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలు. ఇవి ఎంతటి విలువైనవో నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. భారత జాతి తన స్వాతంత్య్రం కోసం దాదాపు ఒకటిన్నర శతాబ్దంపాటు సుదీర్ఘమైన పోరాటం చేసింది. అనేకమంది అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాడారు. అనేక త్యాగాలతో, పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి, స్వయంపాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న భారతావని 75 సంవత్సరాలు పూర్తి చేసుకొంటున్నది. దీనిని మనం వజ్రోత్సవాలుగా నిర్వహించుకొంటున్నామన్నారు.
అహింసాయుత మార్గంలో స్వాతంత్ర్యన్నీ సాధించిన మహాత్మాగాంధీ సంకల్పాన్ని నేటి తరానికి అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని వర్తమాననికి, భావితరాలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో విపక్ష, వెనుకబాటుతనం ఉన్నది దాన్ని రూపుమాపాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనేది మా ఆకాంక్ష 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించి చూపిందని మంత్రి అజయ్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించే మార్గంలో ఎన్నో అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు, మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా రాష్ట్ర ప్రజల ఆశీర్వాద బలంతో వాటన్నిటినీ అధిగమించి పురోగమించగలుగుతున్నది. ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న పరిస్థితులకు, నేటి స్థితిగతులకు అసలు పోలికే లేదన్నది జగమెరిగిన సత్యం. అన్నిరంగాలలో గుణాత్మకమైన, గణనీయమైన అభివృద్ధిని ఆవిష్కరించగలిగాము. వాస్తవం కళ్ళముందే కనపడుతోంది. ప్రగతి ఫలాలు ప్రజల అనుభవం లో ఉన్నాయి. విద్యుత్ సమస్య, తాగునీటి సమస్య, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకోవడమే కాదు, ఈ రంగాలలో నేడు తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆశించిన గమ్యం లక్ష్యం చేరుకోవాలంటే వాక్ శుద్ధి, చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి ఉండాలని సీఎం కేసిఆర్ చెప్పినట్లు ఈ మూడింటి మేళవింపుతో తెలంగాణా ప్రభుత్వం ప్రజాభ్యుదయ పథంలో మునుముందుకు సాగుతుందని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. సమానత్వం, సామాజిక న్యాయం అనే ఉదాత్త లక్ష్యాలను సాధించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. కేవలం ఆర్థిక లక్ష్యాలను సాధించడమే కర్తవ్యంగా భావించే యాంత్రిక ధోరణిని ప్రభుత్వం విడనాడింది. ప్రతీప శక్తులు సీఎం కేసిఆర్ నేతృత్వంలో సాగే మా ప్రయత్నాలకు తీవ్ర విఘాతం కలిగించేందుకు ఎన్ని కుట్రలు చేస్తున్నా ప్రజల ఆశీర్వాదంతో వాటన్నింటిని ఛేదిస్తూ ముందడుగు వేయగలుగుతున్నాం.తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం పాటు పడే మా ఏకాగ్రతను ఇటువంటి క్షుద్ర ప్రయత్నాలతో మరల్చలేరని వారికి మరోసారి స్పష్టం చేస్తున్నాను. శ్రామిక జనుల సౌభాగ్యంకోసం, సకల జనుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతుంది. ప్రజల అండదండలే మాకు తిరుగులేని ఆత్మబలాన్ని అందిస్తున్నాయి. మాలో అంకిత భావాన్ని పెంపొందిస్తున్నాయి. అట్టడుగు వర్గాల దాకా అభివృద్ది ఫలాలను చేరవేసి ప్రజల ముఖాలపై చిరునవ్వులు విరబూసే బంగారు తెలంగాణను సాకారం చేసే మా ప్రయత్నంలో కలిసి వస్తున్న వారందరికీ హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఎన్నో అవాంతరాలు, మరెన్నో విలయాలను అధిగమిస్తూ ఎందరో మేధావులు, రాజనీతిజ్ఞులు, కవులు, కళాకారులు, కోట్లాది మంది కార్మిక కర్షకులను భారత్ ఈ ప్రపంచానికి అందిస్తూనే ఉంది. శతవార్షిక స్వాతంత్ర్య దినోత్సవం నాటికి నిరక్షరాస్యత, పేదరికం, సాంఘిక అసమానతలు లేని దేశంగా భారత్ రూపుదిద్దుకోవాలని కోరుకుంటున్నాను. అలానే తెలంగాణాకే ఆదర్శంగా మన ఖమ్మం అభివృద్ధి చెందుతుంది. ఖమ్మం నగర పాలక సంస్థ ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రూ.4 కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.70 కోట్లతో గోళ్లపాడు చానల్ పనులు, రూ.14 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం జరిగింది. మిషన్ భగీరథ అమృత్ పథకంలో రూ. 229 కోట్లతో మంచినీటి సరఫరా అభివృద్ధి పనులు పురోగతిలో ఉండగా.. నగరంలో ఇంటింటికీ నల్లా పథకంలో 84 వేల గృహాలకు నీరు అందించాము.
17,043 ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు, రూ.73.50 లక్షలతో జిల్లా ప్రధాన గ్రంథాలయం, గాంధీపార్కు గ్రంథాలయాలను ఆధునీకరించాము. నగరంలో రూ.28 కోట్లతో రెండు స్టేజ్లలో నిర్మించిన ఐటీ హబ్ ప్రారంభించుకున్నాము. రూ.70 కోట్లతో ధ్వంసలాపురం ఆర్వోబీ బ్రిడ్జీని ముస్తాఫానగర్ నుంచి ధ్వంసలాపురం గేటు వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మించాము. ఖమ్మం నగరంలోని టేకులపల్లి వద్ద 1,210 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి పేదలకు కేటాయించాము. నగరంలో పారిశుధ్య పనులను మెరుగుపర్చే లక్ష్యంతో రూ.50 కోట్లతో వివిధ కార్యక్రమాలు చేపట్టాము. ఎన్నెస్పీ క్యాంపులో రూ.17.05 కోట్లతో నూతన బస్టాండ్ నిర్మించి రద్దీ తగ్గించి ట్రాఫిక్ సమస్య తీర్చాము. నగరంలో రూ.1000 కోట్ల పైచిలుకు నిధులతో అభివృద్ధికి బాటలు వేయడమైంది. నగరపాలక సంస్థకు ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తున్నాము ఈ నిధులతో అంతర్గత రహదారులు, మంచినీటి వసతి, ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రతిపాదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టాము. గతంలో నగరంలో ఉన్న పరిస్థితులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు అందరికీ కనిపిస్తున్నాయి నగర అభివృద్ధిలో కీలకమైన తాగునీరు, కరెంటు సరఫరా, విద్య, వైద్యం, రవాణా వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి నగరాభివృద్ధి సాధనలో ఖమ్మం దూసుకెళ్తుతుంది, సుస్థిర అభివృద్ధిని సాధించడమైంది మన ఖమ్మం ప్రగతికి నా సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని మరో సారి స్పష్టమైన హామీని ఇస్తూ ప్రజలందరికీ మరోమారు భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను
No comments:
Post a Comment