ఖమ్మం, మార్చి 19: ఎన్నికల నిర్వహణలో ఏ దశలోనూ లోపాలు లేకుండా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. మంగళవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ సునీల్ దత్ తో కలిసి, ఏఆర్ఓ, డిఎస్పీ, ఏసీపీ, నోడల్ అధికారులతో లోకసభ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులు చాలా కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న తప్పిదానికి తావివ్వకుండా వంద శాతం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. శనివారం ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ మేరక ఏప్రిల్ 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రిల్ 26న స్క్రూటిని, ఏప్రిల్ 29 వరకు అభ్యర్థుల ఉపసంహరణ ఉండగా, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందని ఆయన అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, ఎస్ఎస్టి బృందాలను పూర్తి స్థాయిలో పనిచేసేలా చూడాలన్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు వాహనాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నిఘా బృందాలు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల నిర్వహణ చేయాలన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా కేటాయించిన బృందాలు ఏ ఏ ప్రదేశాల్లో ఏర్పాటు చేసింది అడిగి తెలుసుకున్నారు. ఏఆర్ఓ లు నిఘా బృందాల పర్యవేక్షణ చేయాలన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం లోపల సిసి కెమెరా ల ఏర్పాటు వందశాతం చేయాలని, పోలీసుల నివేదిక మేరకు పోలింగ్ కేంద్రాల వెలుపల సిసి కెమెరాల ఏర్పాటుచేయాలన్నారు. ఏఆర్ఓలు, పోలీస్ అధికారులు తమ పరిధిలోని ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి, మౌళిక సదుపాయాల పరంగా, భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి కార్యాచరణ చేయాలన్నారు. సువిధ సింగిల్ విండో ద్వారా అనుమతులు జారిచేయాలని, నిర్ణీత కాలవ్యవధిలోగా అనుమతులు జారీ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రవాణా కార్యాచరణ పకడ్బందీగా చేయాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఆయా సెగ్మెంట్ల పరిధిలోను, రిషిప్షన్ కేంద్రం ఒకేచోట కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి, రిషిప్షన్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు చూసుకోవాలన్నారు. ఎన్నికల పరిశీలకుల సందర్శన లోగా కౌంటింగ్ కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. సి విజిల్ పై విస్తృత చేయాలన్నారు. యువతతో సమావేశాలు నిర్వహించి, సి-విజిల్ పై అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఒక సెక్టార్ లో గరిష్టంగా 12 పోలింగ్ కేంద్రాలుండే విధంగా మరో 10 అదనపు సెక్టార్లు ఏర్పాటుచేశామన్నారు. ఒక పోలింగ్ కేంద్రం ఒకటి కంటే ఎక్కువ సెక్టార్లలో ఉండకుండా చూడాలన్నారు. 85 సంవత్సరాలు పైబడిన వారికి, దివ్యాoగులకు హోం ఓటింగ్ నిమిత్తం ఫారం -12డి లను ఇంటింటికి అందజేయాలన్నారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ, స్వేచ్ఛ, న్యాయబద్ద ఎన్నికల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్రమ నగదు, లిక్కర్, ప్రలోభాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 12 ఎఫ్ఎస్టి, 15 ఎస్ఎస్టి, 2 ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు, 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు, 24 గంటల నిఘా ఉంచినట్లు తెలిపారు. సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ప్రజలతో మర్యాదగా మెదగాలన్నారు. అనుమానిత రవాణా పట్ల చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రచార సామాగ్రిపై ప్రచురణకర్త పేరు, వివరాలు లేకుంటే సీజ్ చేయాలన్నారు. సీజర్ కు 102 కూడా ఉపయోగించాలన్నారు. సీజర్ సమయంలో అన్ని నియమ నిబంధనలను పాటించాలన్నారు. క్రిటికల్, వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల గుర్తింపు మార్గదర్శకాల మేరకు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణా సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్, శిక్షణా ఐపిఎస్ పి. మౌనిక, అదనపు డిసిపి ప్రసాద రావు, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్డీసి ఎం. రాజేశ్వరి, ఖమ్మం, కల్లూరు, కొత్తగూడెం ఆర్డీవోలు గణేష్, శ్రీనివాస్, మధు, డిసిఓ మురళీధర్ రావు, ఐటి అధికారి సాయి కుమార్, జిల్లా శిక్షణ నోడల్ అధికారి కే. శ్రీరామ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------------
జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారిచేయనైనది.
No comments:
Post a Comment