Thursday, 4 January 2024

*జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై* *జనవరి 15తర్వాత* *ఉన్నతస్థాయి సమావేశం : పొంగులేటి హామీ *-


జర్నలిస్టుల ఇంటి స్థలాలు, సంక్షేమ చర్యలకు సంబంధించి జనవరి 15తర్వాత ఒకరోజు సంబంధిత ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం సాయంత్రం సచివాలయంలోని మంత్రి చాంబర్ లో ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల నేతృత్వంలో ఐజేయు కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, టీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు కె.రాంనారాయణలతో కూడిన ప్రతినిధి బృందం భేటీ అయ్యి జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై చర్చించింది.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇంటి స్థలాలకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇప్పటివరకు జారీ చేసిన జీవోలు, మెమోలను సేకరించాలని, అలాగే వాటి ద్వారా ఇచ్చిన స్థలాల వివరాలు, స్వాదీనం చేయకుండా ఉన్న స్థలాల వివరాలు, ఇకముందు ఇవ్వడానికి అనువైన స్థలాలను నిర్ధిష్టంగా పేర్కొంటూ నివేదికలు పంపించాలని రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు ప్రతినిధి బృందానికి మంత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల విషయమై జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలతో పాటు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా గడిచిన రెండు దశాబ్దాలుగా ఇంటి స్థలాలు ఇవ్వనందున జర్నలిస్టులు అధిక సంఖ్యలో ఉన్నారనే విషయాన్ని ప్రతినిధి బృందం మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది. వీటితో పాటు చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ విషయాన్ని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ప్రస్థావించగా, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ముఖ్యమంత్రితో చర్చించి తప్పని సరిగా పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.జర్నలిస్టుల నివేశన స్థలాలు, ఇతర సంక్షేమ చర్యలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, జర్నలిస్టుల సంక్షేమ చర్యలపై ఒక విధానపరమైన ప్రకటన చేస్తామని ఆయన తెలిపారు.జ ర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన వివిధ అంశాలపై టీయూడబ్ల్యూజే ఇచ్చిన 3పేజీల వివరణాత్మక వినతి పత్రాన్ని కులంకశంగా చదివి చర్చించిన మంత్రికి ప్రతినిధి బృందం కృతఙ్ఞతలు తెలిపింది.

No comments:

Post a Comment