Thursday, 31 July 2025

*మణి"రత్నాలు*గా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం : మంత్రి పొంగులేటి

*పాలేరు విద్యాభివృద్ధికి 470 కోట్లు*

- *“పేద పిల్లలను మణిరత్నాలుగా తీర్చిదిద్దుతాం”*

- *తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి*

కూసుమంచి : పాలేరు నియోజకవర్గంలో విద్యా రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు 470 కోట్ల రూపాయలను విద్యాభివృద్ధి కోసం కేటాయించామని తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. “పేద పిల్లలు చదువులో వెనుకబడకూడదు… వారిని మణిరత్నాలుగా తీర్చిదిద్దడమే మా ప్రభుత్వ సంకల్పం” అని ఆయన స్పష్టం చేశారు. గురువారం ఆయన కూసుమంచి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
*జూనియర్ కళాశాలకు శంకుస్థాపన*
కూసుమంచి పాత జెడ్పీ హైస్కూల్ ఆవరణలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. “ఈ భవనాన్ని డిసెంబర్ 31 నాటికి పూర్తి చేసి ఈ ఏడాదిలోనే విద్యార్థుల కోసం ప్రారంభిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడం నాకు గర్వంగా ఉంది” అని మంత్రి అన్నారు.
*76 మంది బాలికలకు సైకిళ్లు*
పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 8వ తరగతి చదువుతున్న 76 మంది బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. “పేద పిల్లలకు ప్రయాణ సౌకర్యం లేక చదువులో వెనుకబడకూడదు. గతేడాది 8, 9, 10వ తరగతుల విద్యార్థినిలు అందరికీ  సైకిళ్లు ఇచ్చాం. వచ్చే ఏడాది నుంచి  జూనియర్ కళాశాలలో చేరుతున్న విద్యార్థినిలకు కూడా సైకిళ్లు అందిస్తాం” అని తెలిపారు.
*లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు*
ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. “పేద కుటుంబాల ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాలను కొనసాగిస్తున్నాం. భవిష్యత్తులో కూడా పేదల కోసం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం జరుగుతాయి” అని ఆయన స్పష్టం చేశారు.
*విద్యా రంగానికి 470 కోట్ల రూపాయలు*
“గడచిన 18 నెలల్లో పాలేరు నియోజకవర్గానికి 470 కోట్ల రూపాయల నిధులు విద్యాభివృద్ధికి  కేటాయించాం. ఐటీఐ, నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతానికి కొత్త శకం తెస్తాయి. చదువు అందరికీ చేరేలా ప్రభుత్వ కృషి కొనసాగుతుంది” అని మంత్రి వివరించారు.
*వ్యక్తిగతంగా సహాయం చేస్తానని హామీ*
“ప్రభుత్వ సహాయంతో పాటు అవసరమైతే నేను కూడా వ్యక్తిగతంగా సాయం అందించేందుకు పేద విద్యార్థులకు అండగా ఉంటాను. స్కూల్ అభివృద్ధి కోసం అవసరమైతే స్వయంగా నిధులు సమకూరుస్తాను. ప్రతి విద్యార్థి మంచి చదువులు చదివేలా నా వంతు కృషి చేస్తాను” అని మంత్రి హామీ ఇచ్చారు.
*విమర్శలపై ఘాటు వ్యాఖ్యలు*
“పూర్వ ప్రభుత్వ పరిపాలన వల్లే ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు కోసం బాధ్యత తీసుకుని, ప్రతి విద్యార్థిని సమాజంలో ఒక ఆభరణంగా తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంది” అని మంత్రి వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment