ఖమ్మం :ప్రజావాణిలో తమ సమస్యలు తెలుపుతూ ప్రజలు అందజేసిన దరఖాస్తులను పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు.సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్వోఓ ఎం. రాజేశ్వరి లతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశిస్తూ, సంబంధిత అధికారులకు ఫార్వార్డ్ చేశారు.తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన ముదిరెడ్డి నర్సిరెడ్డి ఎస్సారెస్పీ ఓల్డ్ కెనాల్ డిబిఎం 60.25 ఆర్ క్రింద 32 కుంటల భూమి కోల్పోయానని దానికి నష్టపరిహారం అందలేదని, ఆ భూమి రైతు బంధు డబ్బులు కూడా రాలేదని, నష్టపరిహారం, రైతుబంధు డబ్బులు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, భూ సేకరణ విభాగానికి రాస్తూ సమస్యను పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన పి. నాగరాజు మార్చి 4న పంచాయతీ కార్యదర్శిగా పోస్ట్ ఇస్తామని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ ధ్రువీకరణ చేశారని, ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వలేదని, ప్రస్తుతం కల్లూరు, తల్లాడ, సత్తుపల్లి, వి.ఎం. బంజర మండలాల్లో ఖాళీగా ఉన్న పోస్టుకు అవకాశం కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, కలెక్టరేట్ పరిపాలన అధికారికి రాస్తూ పరిశీలించి, ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్ల రెవెన్యూ సాతానిగూడెం గ్రామానికి చెందిన డి. మంగతాయమ్మ సర్వే నెంబర్ 520లో తన 9 గుంటల భూమిని వై. వెంకట నారాయణ ఆక్రమించారని, రెవెన్యూ రికార్డులు పరిశీలించి న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసిల్దార్ కు రాస్తూ పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన కోట సుమ తాను బిఎస్సీ, పిజిడిసిఏ, ఇంగ్లీష్, తెలుగు లోయర్, హయ్యర్ టైపింగ్ విద్యార్హత కలిగి ఉన్నానని, తనకు చెవిటి, మూగ బ్యాక్ లాగ్ పోస్టులలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, జిల్లా ఉపాధి అధికారికి రాస్తూ పరిశీలించి అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
***********************************************
*చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం చేయాలి....జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్*
***********************************************
*చిన్నారి పోస్టర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్*
***********************************************
ఖమ్మం : చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన *చిన్నారి* పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్* మాట్లాడుతూ, పిల్లల అక్రమరవాణా, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, ఆన్ లైన్ వేధింపులు, మాదకద్రవ్యాలు మొదలగు అంశాల నివారణ, పిల్లలలో వచ్చే శరీర మార్పులు, గుడ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన సంబంధిత అంశాలను వివరిస్తూ *చిన్నారి* గోడ ప్రతులను రూపొందించి అందరిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ హెల్ప్ లైన్ కట్టుదిట్టంగా పనిచేస్తుందని, పిల్లల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, ఆన్ లైన్ వేధింపులు , మాదకద్రవ్యాలు మొదలగు అంశాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం అందించాలని అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 పై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, డిఆర్డీవో సన్యాసయ్య, డిఆర్డీవో రాజేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారి కె. రాంగోపాల్ రెడ్డి, డిసిపివో విష్ణువందన, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
------------------------------------------------------------------------
డిటిడిసిలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం... జిల్లా సంక్షేమ అధికారి కే. రాంగోపాల్ రెడ్డి*
------------------------------------------------------------------------
*వయోవృద్ధులు, వయోవృద్ధుల ఆశ్రమాలు నిర్వహించు నిర్వాహకులు అధిక సంఖ్యలో పాల్గొనాలి*
------------------------------------------------------------------------
సంచాలకులు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, హైదరాబాద్ ఆదేశాలనుసారం అక్టోబర్ 1న అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవ వేడుకలను స్థానిక టీ.టీ.డీ.సీ. నందు ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి కె. రామ్ గోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా నందు గల వయోవృద్ధులు, వయోవృద్ధుల ఆశ్రమాలు నిర్వహించుచున్న నిర్వాహకులు అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కే. రామ్ గోపాల్ రెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
No comments:
Post a Comment