కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రకృతి పరిరక్షకులు,ప్రముఖ పర్యావరణ వేత్త, 110 సంవత్సరాల పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా సమీక్ష సమావేశానికి సీఎం స్వయంగా తోడ్కొని వెళ్లి పద్మశ్రీ తిమ్మక్క గారిని, సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఉన్న ప్రజాప్రతినిధులకు పరిచయం చేశారు. వారందరి సమక్షంలో సీఎం శ్రీ కేసీఆర్ ఆమెను సత్కరించి, జ్ఞాపికను అందజేశారు.
సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పద్మశ్రీ తిమ్మక్క అన్నారు. సీఎం కేసీఆర్ గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మొక్కలు కావాలంటే తాను అందజేస్తానని తిమ్మక్క గారు సీఎంకు తెలుపడం, పర్యావరణ పరిరక్షణ కోసం తిమ్మక్క గారు పడుతున్న తపన,సమావేశం లో పాల్గొన్న వారిలో స్ఫూర్తిని నింపింది.
పద్మశ్రీ తిమ్మక్క గారి వివరాలు:
--------------------------------
పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క బిబిసి ఎంపిక చేసిన 100 మంది ప్రభావశీల మహిళల జాబితాలో ఒకరిగా నిలిచారు. 25 సంవత్సరాల వరకు పిల్లలు కలగకపోవడంతో మొక్కల్నే పిల్లలుగా భావించి, మొక్కలే పిల్లలుగా, పచ్చదనం పర్యావరణ హితం కోసం తాను పనిచేస్తున్నారు. తిమ్మక్క అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
పుస్తకావిష్కరణ:
----------------
పచ్చదనం పెంపొందించే దిశగా, అడవుల సంరక్షణ మొక్కల పెంపకంపై తెలంగాణ ప్రభుత్వ కృషి, హరితహారం కార్యక్రమం, దాని స్ఫూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ వంటి కార్యక్రమాల ద్వారా జరుగుతున్న పర్యావరణ కృషిపై సాహిత్య అకాడమీ చైర్మన్ శ్రీ జూలూరీ గౌరీశంకర్ సంపాదకత్వంలో, పలువురు రచయితలు రాసిన వ్యాసాల సంకలనం.. ‘ఆకుపచ్చని వీలునామా’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తొలి కాపీని పర్యావరణ పరిరక్షకురాలు పద్మశ్రీ సాలుమరద తిమ్మక్క గారికి సీఎం అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మొక్క నాటడమనేది ఒక కార్యక్రమం కాదని, అది మనల్ని, మన భవిష్యత్తు తరాలను బ్రతికించే మార్గమని అన్నారు. ఆ భాద్యత కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ తిమ్మక్క గారిని మించిన దేశభక్తులు ఎవరూ లేరని కొనియాడారు. ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. మంచి పని లో నిమగ్నమైతే, గొప్పగా జీవించ వచ్చని, మంచి ఆరోగ్యం తో ఉంటారనటానికి పద్మశ్రీ తిమ్మక్క గారు నిలువెత్తు నిదర్శనమని, అందరూ ఆ బాటలో నడవాలని సీఎం ఆకాంక్షించారు.
No comments:
Post a Comment