భద్రాచలం ; భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఆయా జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం నుండి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, డీజీపీ మహేందర్ రెడ్డి గారు, సంబంధిత సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గారు మాట్లాడుతూ, గోదావరిలో నీరు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నందున అన్ని ప్రభుత్వ విభాగాలు మరింత అప్రమత్తంగా ఉండి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు ముమ్మరం చేసేలా అదనపు కంటింజెంట్ ప్లాన్ రూపొందించాలన్నారు.
వేగంగా విస్తరిస్తున్న గోదావరి నీటి ప్రవాహ ప్రమాద తీవ్రత వల్ల ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, ఆయా జిల్లాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రస్తుతం నీటి మట్టం 62 అడుగులకు చేరిందని రానున్న 24 గంటల్లో 75 నుండి 80 అడుగులకు వచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టు భద్రాచలంలో 5వెల ఇసుక బస్తాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ప్రస్తుతం ఎగువ నుండి 30లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకి వస్తుందని, రాగల 24 గంటల్లో అది మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదని అన్నారు.
అన్ని వైపుల, అన్ని రంగాల సహాయక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని, ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.
ప్రమాద తీవ్రత ఎర్పడనున్న ఇళ్ల ప్రజలను సైతం పునరావాస కేంద్రాలకు తరలించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని, అవసరం అయితే మరిన్ని కేంద్రాలు పెంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు పంపిస్తామని వివరించారు.
గోదావరి పరివాహక ప్రాంతం జిల్లాల కలెక్టర్ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుత వరద తీవ్రత వల్ల సద్యమైనంత మేరకు అస్థి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించరు.
ముంపు ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకావాలని, భోజనం, వసతి సదుపాయాల కోసం నిధుల కొరత లేదని, పది వేల మందికైనా సరే ప్రభుత్వపరంగా ఆశ్రయం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గారు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు మానవ ప్రాణనష్టాన్ని అరికట్టేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు.
రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేయడంతో పాటు గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో భద్రాచలం వద్ద రేపటికి నీటి మట్టం 70 అడుగులకు చేరే అవకాశం ఉందని అన్నారు.
ఈ నేపథ్యంలో ముంపుకు గురయ్యే అన్ని లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ప్రత్యేక శిబిరాలకు తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఇప్పటి వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రాణనష్టాన్ని అరికట్టడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు
జేసీబీలు, జనరేటర్లు, ఇసుక బస్తాలు, ఇతర సామాగ్రిని అదనపు పరిమాణంలో కొనుగోలు చేసి, వాటిని వ్యూహాత్మక పాయింట్లలో ఉంచాలని కలెక్టర్లను ఆదేశించారు.
రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి వరద బాధిత జిల్లాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సహాయ, పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా అదనపు బలగాలతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు తదితర పరికరాలను జిల్లాలకు పంపుతున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డిగారు తెలిపారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ గారు, అదనపు డీజీలు జితేందర్ గారు, సంజయ్ జైన్ గారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు, పీఆర్ అండ్ ఆర్డీ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారు, విధ్యుత్, రోడ్లు భవనాలు, ఇరిగేషన్ ఈఎన్సీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment