Monday, 25 July 2022

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు : జిల్లా కలెక్టర్లతో మంత్రి తన్నీరు హరీష్ రావు.


ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సీజనల్ వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలలో పారిశుద్ధ్య నిర్వహణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రహదారులు, మురుగు కాలువలు, నివాస ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలకుండా పురపాలక, పంచాయతీరాజ్, సంబంధిత శాఖల సమన్వయంతో అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ కార్యక్రమం చేపట్టి ప్రజలను భాగస్వామ్యులను చేయడమే కాకుండా కార్యక్రమ అవశ్యతను వివరించాలని, ప్రతి శుక్రవారం గ్రామాలలో, ఆదివారం పట్టణాలలో డ్రై డే పాటించే విధంగా కార్యచరణ రూపొందించాలని, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగ్యూ, మలేరియా కేసులను ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స చేయడానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని, మందులు ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు అందరికీ అందే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూరిభా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందే విధంగా కలెక్టర్లు, ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని, పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం కల్పించాలని, ఆగస్టు మాసం నాటికి ప్రతి విద్యా సంస్థలో ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 12-17 వయస్సు గల విద్యార్థులకు వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. మురికి కాలువలను పరిశుభ్రం చేయాలని, మిషన్ భగీరథ ట్యాంకులను శుభ్రం చేయాలని, పైప్ లైన్ లీకేజీలను అరికట్టాలని, వసతి గృహాలు, పాఠశాలలకు మిషన్ భగీరథ త్రాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కాచిన చలార్చి వడపోసిన నీటిని త్రాగే విధంగా ప్రచారం చేయాలని, అధికారులు తరచూ వసతి గృహాలను ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, ప్రభుత్వ వసతి గృహాలలో ఉన్న పాత బియ్యం నిల్వల స్థానంలో నూతన బియ్యం సరఫరా చేస్తున్నామని, వాటిని వినియోగించు కోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టామని, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, పురపాలక శాఖల అధికారులు సమన్వయంతో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు అధికంగా నమోదయ్యే ప్రాంతాలను గుర్తించి నియంత్రణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన మందులను అందించడం జరుగుతుందని, విషజ్వరాల అనుమానితులకు పరీక్షలు నిర్వహించి తగు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

No comments:

Post a Comment