తిరుపతి, 09 ఆగస్టు 2020 :
టిటిడి ఆదాయం కోసం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనాలు చేయిస్తోందని, మీడియా, సోషల్ మీడియా ద్వారా అనేక మంది చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, తాము ఆదాయం కోసం దర్శనాలు చేయించడం లేదని టిటిడి ఈఓ శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు లోబడి అనేక జాగ్రత్తలు తీసుకుంటూ రోజుకు 12 వేల మందికి దర్శనం కల్పించే ఏర్పాటు చేశామన్నారు. తిరుపతిలో పాక్షిక లాక్డౌన్ కారణంగా, తిరుపతిలో రోజుకు కేటాయిస్తున్న 3 వేల ఉచిత దర్శన టోకెన్లను కొంతకాలంగా నిలిపివేసినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల వల్ల కొన్ని రోజులు తిరుమలలో దర్శనాలు చేసుకున్నవారి సంఖ్య తగ్గిందన్నారు. రెండు, మూడు రోజులుగా దర్శనాలు చేసుకుంటున్నవారి సంఖ్య బాగా పెరిగిందని తెలిపారు. తిరుపతిలో కరోనా కేసులు పెరగడానికి తిరుమల దర్శనాలే కారణమని కొంతమంది చేస్తున్న విమర్శల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. కరోనా సమయంలో కూడా భక్తులకు మెరుగైన సేవలందిస్తున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా బారినపడిన చాలామంది ఉద్యోగులు కోలుకుని విధులకు హాజరవుతున్నారని, మరికొంత మంది చికిత్సలో ఉన్నారని చెప్పారు.
తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో ఆదివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. టిటిడి ఉద్యోగుల్లో మొత్తం 743 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 402 మంది కోలుకున్నారు, 338 మంది చికిత్స పొందుతున్నారు, ముగ్గురు మృతి చెందారు. కరోనా బారిన పడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జెఇఓ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతోంది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జూలై 31న నిర్వహించిన ఆన్లైన్ వరలక్ష్మీ వ్రతంలో 3,507 మంది గృహస్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి రాలేని భక్తులు ఇ-హుండీ ద్వారా ఆన్లైన్లో కానుకలు సమర్పించే సదుపాయం కల్పించాం. www.tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారాగానీ, గోవింద మొబైల్ యాప్ ద్వారా గానీ భక్తులు కానుకలు చెల్లించవచ్చు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ఆన్లైన్ వరక్ష్మీ వ్రతం తరహాలో తిరుమల శ్రీవారి ఆలయంలో ఆన్లైన్ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించాం. ఆగస్టు 7న - 118 మంది గృహస్తులు, ఆగస్టు 8న - 597 మంది గృహస్తులు, ఆగస్టు 9న - 256 మంది గృహస్తులు టికెట్లు బుక్ చేసుకున్నారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ను యాడ్ ఫ్రీ ఛానెల్గా మారుస్తాం.
ఎస్వీబీసీ నిర్వహణకు ఏడాదికి రూ.3 కోట్ల నుండి రూ.4 కోట్ల వరకు వ్యయం అవుతోంది. ఈ క్రమంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్వీబీసీ ట్రస్టుకు మూడు వారాల వ్యవధిలోనే రూ.2.61 కోట్ల విరాళాలు అందాయి.
ట్రస్టుకు వచ్చే ఆదరణను బట్టి టిటిడిపై అదనపు భారం పడకుండా ఎస్వీబీసీ హెచ్డి ఛానల్ ప్రారంభించాలని నిర్ణయించాం.
త్వరలోనే దేశవ్యాప్తంగా హిందీ, కన్నడ భాషల్లో ఎస్వీబీసీ ప్రసారాలు చేస్తాం.
త్వరలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శ్రీమద్భగవద్గీత, గరుడ పురాణం పారాయణం ప్రత్యక్ష ప్రసారం చేస్తాం.
ఎస్వీబీసీలో శ్రీవారి కల్యాణోత్సవం ప్రత్యక్ష ప్రసారం కారణంగా అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందించలేకపోయాం. ఆ తరువాత న్యూస్ బులెటిన్లో ప్రముఖంగా ప్రసారం చేశాం. ఇందులో ఎలాంటి ఇతర ఉద్దేశాలు లేవు. కొంతమంది దీనిపై అనవసరంగా విమర్శలు చేసే పని ప్రారంభించారు.
జూలై నెలలో శ్రీవారి ఆలయంలో నమోదైన వివరాలు :
శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 2.38 లక్షలు
- హుండీ ఆదాయం - రూ.16.69 కోట్లు
- తిరుమల శ్రీవారి ఇ-హుండీ ఆదాయం - రూ.3.97 కోట్లు
- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఇ-హుండీ ఆదాయం - రూ.8.16 లక్షలు
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 11.35 లక్షలు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 2.59 లక్షలు
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 78,944
- క్షురకులు వినియోగిస్తున్న పిపిఇ కిట్లు - 350 పిపిఇ కిట్లు ఉపయోగిస్తున్నట్లు..ఇ.ఓ.తెలిపారు.
No comments:
Post a Comment